సీఎం కేసీఆర్ తో సీఎం జగన్ లాలూచీ .. మంత్రుల అబద్దాలు, ప్రజలకు ద్రోహం : దేవినేని ఉమా ధ్వజం
పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు దేవినేని ఉమ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సాక్షాత్తూ మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు .ప్రగల్భాలు పలకటం ఆపి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేసిన ఆయన, పునరావాసం విషయంలో పోలవరం నిర్వాసితుల పక్షాన టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది అని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ మాట విని జగన్ ఏపీకి అన్యాయం చేస్తారా ? పోలవరం ఎత్తు తగ్గిస్తే ఊరుకోం : దేవినేని ఉమా ఫైర్
కేవలం హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడం కోసం పోలవరానికి నష్టం
పోలవరం ఎత్తు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని దీనిపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే మంత్రులు స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు.
సీఎం కేసీఆర్ తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి లాలూచీ పడ్డారని దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడం కోసం సీఎం కేసీఆర్ తో కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తున్నారన్నారు. సీలేరు, శబరిని తాకట్టు పెట్టే హక్కు జగన్ కు లేదని హెచ్చరించిన ఆయన, ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
కమీషన్ల కోసమే విశాఖకు పైప్ లైన్లా ? .. ఉమా రివర్స్ పంచ్
పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు ఆపేశారు అని ప్రశ్నించిన దేవినేని ఉమా పోలవరం లెఫ్ట్ కెనాల్, పురుషోత్తమ పట్నం ఉండగా విశాఖకు పైప్ లైన్ వేస్తున్నామని మాట్లాడుతున్నారని, ఇక పైప్ లైన్ లలో ఎంత కమిషన్లు మాట్లాడుకున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం నిర్మాణం చేపట్టారన్న వ్యాఖ్యలకు కౌంటర్ గా దేవినేని ఉమా ఈ వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రారంభించామని, జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన ఉమా వైయస్ హయాంలో మట్టి పనులు మాత్రమే చేశారని గుర్తు చేశారు.
Recommended Video
150 అడుగుల కట్టాల్సిన పోలవరం 135 అడుగులు కట్టాలని రాజీ పడ్డారని ఆగ్రహం
పోలవరం నిర్మాణం 70 శాతానికి పైగా టిడిపి హయాంలోనే పూర్తి చేశామని, పోలవరం నిర్మించిన ఘనత టిడిపికే చెందుతుందని ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు దేవినేని ఉమ . పోలవరంపై ప్రధానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు అని ప్రభుత్వ తీరును తప్పుపట్టిన ఉమా కాంగ్రెస్ వైఖరితో పోలవరంపై 2537 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఆరోపించారు. 150 అడుగుల కట్టాల్సిన పోలవరం నిర్మాణాన్ని 135 అడుగులు కట్టాలని రాజీ పడ్డారని విమర్శించిన ఆయన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారో ఖచ్చితమైన డేట్ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.