పోలీసు అమరవీరులకు జగన్ ఘన నివాళి- ఏడాదికి 6500 పోలీసు ఉద్యోగాల భర్తీ...
విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసు సిబ్బందిని ఏపీ స్మరించుకుంటోంది. పలు జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం ఈసారి అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్దాయి పోలీసు అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఇందిరాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు అమర వీరుల సంస్మరణ స్ధూపానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పది రోజుల పాటు జరిగే సంస్మరణ దిన కార్యక్రమాలను జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా "అమరులు వారు" పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 2019-20 సంవత్సరంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయాన్ని జగన్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్. ఈ రోజు అమరవీరులను స్మరించుకునే రోజు, ప్రాణాలు వదిలిన ప్రతీ పోలీసు కుటుంబానికి మన దేశం జేజేలు పలుకుతుందని తెలిపారు. అధికారం నిష్టగా నిర్వహించాల్సిన కార్యక్రమమని, తలసరి ఆదాయాన్ని చూసి దేశాభివృద్ధిని అంచనా వే్తారు కానీ నేరాల రేటు తగ్గడం కూడా చాలా ముఖ్యమన్నారు. అది రాత్రికి రాత్రి జరగదన్నారు. కానీ తగ్గించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం ఎప్పుడూ చేస్తూనే ఉంటుందన్నారు. శాంతి భద్రతలు ప్రభుత్వానికి అతి మఖ్యమైన అంశమని సీఎం జగన్ తెలిపారు.
పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రత అతి ముఖ్యమన్నారు.
బలహీన వర్గాలపై దాడులను సహించబోమని సీఎం జగన్ తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు. అవతలి వారు ఎంత పెద్ద వారయినా వదలే ప్రసక్తి ఉండరాదన్నారు. మహిళల భద్రత కోసం తెచ్చిన దిశ బిల్లు త్వరలో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు జగన్ తెలిపారు. పోలీసుల కష్టం తనకు తెలుసని, కరోనా సమయంలో ఏ స్ధాయిలో వారు పనిచేశారో అందరికీ తెలుసన్నారు. టెక్నాలజీ విసిరే సవాళ్లు, కోవిడ్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీలు, ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడంలో పడే కష్టం తనకు తెలుసని జగన్ తెలిపారు. ఏడాదికి 6500 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినట్లు జగన్ వెల్లడించారు.