బాబు..పవన్కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!
ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయటం తో ముఖ్యమంత్రి ఇసుక అంశం మీద కలెక్టర్లు..ఎస్పీలతో సమీక్షించారు. విపక్ష నేతలు రాబందుల్లా మనపై రాళ్లు వేస్తున్నారు అని సీఎం వ్యాఖ్యానించారు. వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని ఆదేశించారు. డీజీపీ దగ్గరుండి దీనిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ చర్య వలన ఇసుక లేక కూలీలకు పనులు దొరకలేదన్న సమస్య తలెత్తదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు..పవన్ కు అవకాశం ఇవ్వద్దు..
ఏపీలో టీడీపీ..జనసేన నేతలు ఇసుక అంశం మీద ప్రభుత్వం లక్ష్యంగా చేస్తున్న విమర్శల పైన ముఖ్యమంత్రి స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు ఏ అంశం లేక..దీని పైన ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పలువురు మంత్రులను అనేక ప్రాంతాల్లో ఇసుక కొరత కారణంగా పనులు కోల్పోయమంటూ భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. అదే విధంగా టీడీపీ నిరసనలు కొన సాగిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విశాఖలో భారీ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీంతో..ఆ రెండు పార్టీలకు అవకాశం లేకుండా ఇసుక సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎదుర్కోవటంతో పాటుగా అధికారులను సమాయత్తం చేసారు. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామంటూ..
ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలు రాబందుల్లా మనపై రాళ్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో వ్యవస్థ తీవ్ర అవినీతిమయం అయిందని విమర్శలు గుప్పించారు. గతంలో ఇసుకను దోచేశారని, తాము దానిని సరిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు ఎప్పుడో చెప్పానని అన్నారు. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం మంచిదని పేర్కొన్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక వారోత్సవాలు పెడతామని, వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదు..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని సీఎం జగన ఆదేశించారు. డీజీపీ దగ్గరుండి దీనిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ చర్య వలన ఇసుక లేక కూలీలకు పనులు దొరకలేదన్న సమస్య తలెత్తదని అభిప్రాయపడ్డారు. ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలమన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదేనని చెబుతూ... దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే అన్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోందని... వరదల వల్ల ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నామని... ఇసుక వారోత్సవం అని కార్యక్రమం పెడదామని చెబుతూ.. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దామని.. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు.