టిట్ ఫర్ టాట్: నాడు చంద్రబాబు..నేడు జగన్: అదే మార్గంలో దెబ్బ తీయాలి..అందుకే ఇప్పుడు..!
దెబ్బ కొట్టారు..స్వకరించాం. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. సమయం వస్తుంది..చూపిస్తాం. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తరువాత జగన్ స్పందన ఇది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. తనను ఏ మార్గంలో అయితే టీడీపీ అవమానించిందో..అదే దారిలో వెళ్లి చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ..చంద్రబాబు తరహాలో రాజీనామాలు చేయకుండా టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోవటానికి సిద్దంగా లేరు. అధికారికంగా వైసీపీ లో చేరాలంటే మాత్రం టీడీపీకి రాజీనామా చేయాల్సిందే. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన అయిదు నెలలకే చంద్రబాబు ను రాజకీయంగా దెబ్బ తీయటం ప్రారంభించారు. ఇందుకు నాడు చంద్రబాబు అనుసరించిన విధానాన్నే మార్పులతో ఎంచుకున్నారు. నాడు చంద్రబాబు టైం..ఇప్పుడు తన టైం అని చెప్పకనే చెబుతున్నారు. ఇంతకీ జగన్ ఏ విషయంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు..దెబ్బకు దెబ్బ అంటూ ఏ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు...
వంశీ రాజీనామాపై సీఎం తేల్చేసారు: వెంకటరావుకు జగన్ ఇచ్చిన హామీ అదే : అసెంబ్లీలో ఆయన ఇలాగే..!
నాడు జగన్ లక్ష్యంగా.. ఆదిని అస్త్రంగా..
వైసీపీ నుండి 2014లో జమ్మలమడుగు నుండి గెలిచిన ఆదినారాయణ రెడ్డిని టీడీపీ తమ పార్టీలో చేర్చుకుంది. టీడీపీలో చేరిన నాటి నుండి అటు శాసనసభలో..ఇటు బయటా నాడు అదినారాయణరెడ్డికి అప్పగించిన ఒకే ఒక బాధ్యత..జగన్ ను లక్ష్యంగా చేసుకోవటం. జగన్ సొంత జిల్లా..అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో ఆయనను చంద్రబాబు సరైన అస్త్రంగా మలచుకున్నారు. టీడీపీలో చేరిన నాటి నుండి జగన్ పైన తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసారు. జగన్ కు సీఎం అనే కల తప్పితే..అది నెరవేరేది కాదంటే అనేక సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత మంత్రి అయ్యారు. అయినా...జగన్ లక్ష్యంగానే పని చేసారు. జగన్ ను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసేవారు. ఇక, జగన్ పాదయాత్ర సమయంలో దాదాపు ప్రతీ సందర్భంలోనూ జగన్ పైన విమర్శలకు ఆది ముందుండే వారు. ఇక, ఎన్నికల సమయంలో కడప జిల్లాలో ఆది ప్రభావం చూపిస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఊహించని ఫలితాలు వచ్చాయి.
ఇప్పుడు జగన్ అస్త్రంగా వల్లభనేని వంశీ
ఇక, జగన్ అధికారంలోకి వచ్చారు. గతంలో చంద్రాబు ఏ సమీకరణాలను అడ్డుపెట్టుకొని తనను ఇబ్బంది పెట్టాలని చూసారో..అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే టీడీపీ ఎమ్మెల్యే వంశీని తమ వైపు తిప్పుకున్నారు. ఆయనను అధికారికంగా వైసీపీలో చేర్చుకోవాలంటే ముందుగా టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ తానే నిర్ణయించిన నిబంధనలను ఉల్లంఘించకుండా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగేలా వ్యూహం అమలు చేస్తున్నారు. ఇక, నాడు ఆదినారాయణ రెడ్డిన చంద్రబాబు ఏ రకంగా ఉపయోగించారో..ఇప్పుడు ఒక రకంగా అదే తరహాలో జగన్ వంశీని ఎంచుకున్నారు. చంద్రబాబు సొంత సామాజిక వర్గంతో పాటుగా చంద్రబాబు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్న క్రిష్టా జిల్లా నుండి వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాడు ఆది ఏ రకంగా అయితే జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారో..ఇప్పుడు వంశీ అదే విధంగా చంద్రబాబు ఆయనతో పాటుగా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నారు.
రెడ్డి వర్గ నేతలకు నాడు చంద్రబాబు వల..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన ను రాజకీయంగా దెబ్బ తీయటానికి సామాజిక సమీకరణాలను ఆధారం చేసుకొనే ప్రయత్నం చేసారు. రాయలసీమలో రెడ్డి వర్గం ప్రధానంగా జగన్ తో నడుస్తున్న సమయంలో అదే ప్రాంత నుండి..జగన్ పార్టీ నుండే గెలిచిన రెడ్డి వర్గ నేతలకు గాలం వేసారు. ఆదినారాయణ రెడ్డి..భూమా నాగిరెడ్డి..అఖిల ప్రియ..అమర్నాధ రెడ్డి లాంటి వారితో పాటుగా వైసీపీ నుండి 2014 ఎన్నికల్లో గెలిచిన ఎస్సీ..మైనార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారు. వారి ద్వారా జగన్ పైన విమర్శలు చేయించే వారు. అయితే, అక్కడ వారితో రాజీనామా లేకుండా పార్టీలో చేర్చుకోవటం టటీడీపీకి మైనస్ అయింది.
ఇప్పుడు రివర్స్ రూట్లో సీఎం జగన్..
ఇక, ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా దేవినేని అవినాష్.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, కమ్మ వర్గానికి చెందిన ఇతర నేతలు ప్రధానంగా క్రిష్టా..గుంటూరు జిల్లాల్లోని వారి పైన వైసీపీ ఫోకస్ పెట్టింది. దీంతో..రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ జంపింగ్ లు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాకు చెందిన ఇదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలతో వైసీపీ ముఖ్యులు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా..ముఖ్యమంత్రి జగన్ తాను ఎదుర్కొన్న ఎదురు దెబ్బలను ఇప్పుడు టీడీపీకి తెలిసేలా చేయటమే లక్ష్యంగా..అదే సమయంలో ఎన్నికల ఫలితాల ద్వారా డీలా పడిన ఆ పార్టీని మరింతగా గందరగోళానికి గురి చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.