రేపు ఇంద్రకీలాద్రిపై మూలానక్షత్రం శోభ-భక్తుల పోటు-దుర్గమ్మకు జగన్ పట్టువస్త్రాల సమర్పణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక వీఐపీలు, వీవీఐపీల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో రేపు మూలానక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నా రు.
రేపు మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు భావిస్తుంటారు.దీంతో ప్రతీ ఏటా మూలానక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతుంటారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి,దేవాదాయమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈసారి మూలానక్షత్రం వేడుకలకు దాదాపు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగినట్లుగానే భారీ స్ధాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవాళ అర్ధరాత్రి 1.30 నుంచి దర్శనం ప్రారంభిస్తామని విజయవాడ కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. 100,300,500 రూపాయల దర్శనం టికెట్స్ విక్రయించడం లేదన్నారు. ఉభయ దాతలకు 3 వెహికల్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వృద్దులు,వికలాంగులకు మాత్రం రేపు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 మధ్య సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దసరా నవరాత్రుల వేళ అందరికీ సేవా దర్శనం కల్పిస్తున్నట్లు నగర సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రేపు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాత్రి 12.30 నుంచి పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. సీఎం జగన్ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు.