కేంద్రం చేయలేకపోయింది.. కానీ జగన్.: పోలవరంలో తరువాతి అడుగు..అదే : వారూ బాధ్యులే అంటూ..!!
జగన్ ప్రభుత్వానికి భారీ రిలీఫ్. రివర్స్ పాలన అంటూ విమర్శలు తలెత్తుతున్న పరిస్థితుల్లో అదే రివర్స్ టెండరింగ్ ఇప్పుడు ఆయుధంగా మారుతోంది. సరిగ్గా అదును చూసి జగన్ దెబ్బ కొట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాయంలో పనులు దక్కించుకున్న సంస్థే ఇప్పుడు తక్కువ రేటుకు టెండర్ దాఖలు చేయటం..అందునా రూ.274.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లోనే.. రూ.58.53 కోట్లు ఖజానాకు ఆదా అవుతోంది. అయితే..ఇది కేవలం చంద్రబాబును మాత్రమే లక్ష్యంగా చేసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడ కాదు. ముఖ్యమంత్రి జగన్ తన మీద టీడీపీ పదే పదే చేస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టే వ్యూహం. అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో నాడు పని చేసిన వారితో పాటుగా పోలవరం ప్రాజెక్టు అధారిటీ..కేంద్ర జలవనరుల శాఖ సైతం సమాధానం చెప్పాకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమైన సమయంలో ఏం చెప్పారో..అదే ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. అయితే..ఇది శాంపిల్ మాత్రమే. అసలు కధ ముందుంది అంటున్నారు..
కేంద్రం చేయలేనిది జగన్ చేసారా....
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి జగన్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు ఇవే ఆరోణలు చేసారు. ప్రధాని మోదీ సైతం పోలవరం చంద్రబాబుకు ఏటియం కార్డుగా మారిందంటూ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కోరిన తరువాత ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్థానిక ప్రభుత్వానికి అప్పగించామని కేంద్ర ప్రభుత్వం పలు మార్లు స్పష్టం చేసింది. అయితే.. అవినీతి ఆరోపణలు చేసినా..కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీపీఆర్ ను పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఫార్సు మేరకు ఆమోదించింది. అదే విధంగా బిల్లుల చెల్లింపులు చేసింది. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ పోలవరం పనుల పైన రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించారు. పోలవరం లో అవినీతి పైన నిపుణలు కమిటీ నియమించి..వారి నుండి నివేదిక కోరారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలవరం లో దాదాపు రెండు వేల కోట్లకు పైగా అవీనీతి జరిగిందని తేల్చారు. ఇదే సమయంల పోలవరం ప్రాజెక్టు అధారిటీ మాత్రం అవినీతికి ఆస్కారం లేదని స్పస్టం చేసింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తన వాదన వాస్తవమని నిరూపించుకొనే యత్నంలో భాగంగా 65వ ప్యాకేజీకీ రివర్స్ టెండరింగ్ లో దాదాపు రూ.58.53 కోట్లు ఖజానాకు ఆదా చేస్తున్నామని నిరూపించటమే కాకుండా.. గత ప్రభుత్వం లో జరిగిన అవినీతికి ఇది నిదర్శనం అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.
మరి..చంద్రబాబు ఒక్కరే బాధ్యులా...
ఇప్పుడు తాము రూ.274.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లోనే.. రూ.58.53 కోట్లు ఖజానాకు ఆదా చేసామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. మరి..ఇదే సమయంలో నాడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని దీని ద్వారా రుజువు అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి..వారు చెబుతున్నట్లుగా నాటి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసి ఉంటే దానిని సరిగ్గానే ఉందంటూ సర్టిఫై చేసిన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సైతం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ పైన కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ వివరణ పీపీఏ కోరింది. అయితే, ఇప్పుడు తక్కువ ధరకు రివర్స్ టెండరింగ్ ద్వారా ఖరారు కావటంతో..ఇక, పీపీఏ చేసే సూచనలను కేంద్రం ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందనేది చర్చకు కారణమైంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం పోలవరంలోని మిగిలిని నిర్మాణాలకు సైతం రివర్స్ టెండరింగ్ కు వెళ్లేందుకు ఇక అభ్యంతరాలు ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజగా ఒక వర్క్ కు సంబంధించి టెండర్ లోనే జగన్ తాను ఏమీ చెప్పదలచుకున్నదీ..ఇప్పటికే కేంద్రానిని నివేదించిందీ దీని ద్వారా నిరూపించారు. దీంతో..ఇక, జగన్ తీసుకొనే నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ లబించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తన పైన ఇక అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టేలా..
ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు సహా పలువురు నేతలు సీబీఐ దాఖలు చేసిన కేసులను ప్రస్తావిస్తూ అవినీతి పరుడంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీలు సైతం రివర్స్ టెండరింగ్ ద్వారా అయిదు రూపాయాలు కూడా ఆదా చేయలేరంటూ వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని నిరూపించే ప్రయత్నం చేయటంతో పాటుగా తాను అవినీతి చేయటం లేదని..రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదా చేస్తున్నానని చెప్పుకోవటానికి ఇప్పుడు ఈ వ్యవహారం జగన్ కు అవకాశంగా మారుతోంది. అయితే, టీడీపీ నేతలు మాత్రం దీని ద్వారా ప్రాజెక్టు నాణ్యత దెబ్బ తింటుందని..అసలు ఈ ధరలతో నిర్మాణం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో మరిన్ని పనులకు నిర్వహించే రివర్స్ టెండరింగ్ ద్వారా మరింతగా పట్టు సాధించాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.