ప్రతిపక్ష నేతలపై జగన్ ప్రతీకారం, ఏపీ సీఎంపై అచ్చెన్నాయుడు విసుర్లు
ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ కమిటీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా వచ్చిన ప్రజాతీర్పును జీర్ణించుకోలేక పోతున్నారని ఫైరయ్యారు. ప్రతిపక్ష నేతలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తగిన సమయం చూసి.. ప్రజలే బుద్ది చెబుతారని తెలిపారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు జగన్రెడ్డి నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. కానీ కొందరు పోలీసులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. 20 నెలల పాలనలో రాష్ట్రానికి జగన్రెడ్డి చేసింది శూన్యమని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు అని చెప్పారు.
ఏపీలో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నాలుగో విడత ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి అనుకూల అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. టీడీపీ నామమాత్రంగా ప్రభావం చూపిస్తోంది. బీజేపీ, జనసేన అభ్యర్థుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. సింగిల్ డిజిట్కే వారు పరిమితం అయ్యారు. ఆశించిన మేర ప్రభావం చూపించడం లేదు. మరో విడతలో కూడా అధికార వైసీపీ పవనాలే వీచే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్ను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.