మగాడివైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద బహిరంగ చర్చకి రా... సీఎం వైఎస్ జగన్కు ఎమ్మెల్యే పయ్యావుల సవాల్
ఏపీలో రాజధాని రగడ తారాస్థాయికి చేరుకుంది. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మూడు రాజధానుల ప్రకటన చేసిన ఏపీ సీఎం జగన్ రాజధాని తరలించాలనే నిర్ణయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజధాని తరలింపునకు నిరసనగా రాజధాని ప్రాంత రైతుల నుండి తీవ్ర ఆందోళనలతో సీఎం జగన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్న, విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు
రాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్..ఎన్హెచ్ఆర్సీకి టీడీపీ ఫిర్యాదు
జగన్మోహన్ రెడ్డి కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇదే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గట్టిగా చెప్తున్న మాట . జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపధ్యంలో రాష్ట్రంలో టీడీపీ ఆందోళనల బాట పట్టింది. రాజధాని అమరావతిని మార్చొద్దని , ఏపీ రాజధాని అమరావతినే అని తేల్చి చెప్తుంది. ఇక వైసీపీ నేతలు రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇటీవల వీడియోలతో మరీ చూపించారు. టీడీపీ నేతలు రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని పేర్లతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు .
నాలుగెకరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నానా ?..భగ్గుమన్న పయ్యావుల కేశవ్
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ సీఎం జగన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఘాటుగా స్పందించిన పయ్యావుల కేశవ్ తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఏంటో అనంత వాసులకు మొదటి నుండి తెలుసన్నారు. నాలుగెకరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నానని అనుకుంటున్నావా జగన్ మోహన్ రెడ్డి అంటూ సూటిగా ప్రశ్నించారు పయ్యావుల కేశవ్ . ఇక జగన్ ను రాజకీయాలలోకి రాకముందు నీ కుటుంబ ఆస్తులేంటి? నా కుటుంబ ఆస్తులేంటి ఒక్కసారి తెలుసుకోవాలని హితవు చెప్పారు.
మగాడివైతే, రాయలసీమ రక్తం ఉంటే చర్చకు రా .. బహిరంగ సవాల్
నిజంగా నువ్వు మగాడివైతే, రాయలసీమ రక్తం ఉంటే మూడు తరాల నీ ఆస్తుల పైన, మూడు తరాల నా ఆస్తుల పైన బహిరంగ చర్చకి సిద్ధం కావాలని అన్నారు. తమ కుటుంబం ఆర్ధిక స్థితి గతంలో ఎలా ఉందో వేల ఎకరాల నుండి ఎక్కడికి వచ్చిందో అనంతపురంలో అందరికీ తెలుసన్నారు. ఇక కడపలో నీ ఆస్తులు ఎలా పెరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని వ్యాఖ్యానించిన ఆయన ఈ విషయాల చర్చ రాష్ట్రం నడిబొడ్డున చేద్దాం రమ్మని సవాల్ చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకి బహిరంగ చర్చకి రావాలని చాలెంజ్ విసిరారు పయ్యావుల కేశవ్.
జగన్ ఆస్తులన్నీ బినామీ పేర్లతోనే .. పయ్యావుల ఆగ్రహం
ఇక జగన్ ఇంటి పై కూడా వ్యాఖ్యలు చేసిన పయ్యావుల కేశవ్ జగన్ ఇల్లు మాత్రమే కాదు, హైదరాబాద్ లోటస్ పాండ్, బెంగళూర్ ప్యాలస్, తిరిగే వాహనాలన్నీ బినామీ పేర్ల మీద ఉన్నాయని తెలిపారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అవినీతి ఉందని ఆరోపణలు చెయ్యటం కాదు, నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు.