స్వర్ణ పాలెస్ ఘటనపై ప్రాథమిక నివేదిక, కేటగిరి-ఏ ట్రీట్మెంట్ పర్మిషన్ రద్దు: కలెక్టర్ ఇంతియాజ్
స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్రి యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ తేల్చిచెప్పింది. జీవో 77ను అతిక్రమించి ఆసుపత్రి యాజమాన్యం ఫీజులను భారీగా వసూలు చేశారని తెలిపింది. ప్రాథమిక నివేదికతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
కోవిడ్ కేర్ అందించడంలో కేటగిరి-ఏ ట్రీట్మెంట్ అందించే అసుపత్రి పర్మిషన్ రద్దు చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
జీవో ఎంఎస్ నంబర్-77ను అతిక్రమించి అధికంగా ఫీజులను వసూలు చేసింది. రూల్-9 ఏపీ అల్లోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ర్టేషన్, రెగ్యులేషన్ రూల్స్ను రమేష్ హాస్పిటల్ పట్టించుకోలేదని నివేదించింది. ఆసుపత్రి రిసెప్షన్లో అందిస్తున్న సేవల ధరను ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ ప్రదర్శించాలని... కానీ అలాంటి బోర్డును ఉంచలేదు. మెట్రో పాలిటన్ హోటల్, ఎం- 5 హోటల్లో జిల్లా అధికారుల అనుమతి లేకుండా కోవిడ్ కేసులను జాయిన్ చేసుకుందని కమిటీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నది.
Recommended Video
డీఎంహెచ్వో క్యాంపు ఆఫీస్ వద్ద 30వ తేదీలోపు కమిటీ గుర్తించిన అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటే విచారణకు వారం రోజుల ముందే తెలియజేయాలని తెలియజేసింది. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను విచారణకు వచ్చే ముందు తీసుకువచ్చి, స్వాదీనం చేయాలని కమిటీ ఆదేశించింది.