కేబినెట్ పై ఏంటీ గందరగోళం: 20నే మంత్రివర్గ సమావేశం: ప్రభుత్వంలో ఏం జరుగుతోంది..!
మూడు రాజధానులు..విశాఖ నుండే పరిపాలనా రాజధాని విషయం పైన ప్రభుత్వంలో తెలియని అయోమయం కనిపిస్తోంది. ఈ నెల 20న ఉదయం కేబినెట్ సమావేశం..అందులోనే హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర..ఆ వెంటనే అసెంబ్లీలో చర్చకు వీలుగా ప్రభుత్వం తొలుత కార్యాచరణ సిద్దం చేసింది. అయితే, శుక్రవారం హైపవర్ కమిటీ సభ్యులు సీఎం ను కలిసారు. నివేదిక తుది రూపుపైన చర్చించారు. ఆ వెంటనే కేబినెట్ ను ఈ రోజు మద్యాహ్నం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులకు..అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ, రాత్రికి మరోసారి ఆలోచన మారింది. శనివారం కాదని..ముందుగా నిర్ణయించిన ప్రకారమే సోమవారం ఉదయమే మంత్రివర్గ సమావేశం ఉంటుందని రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ పంపారు. ఇంతకీ..ఈ గందరగోళానికి కారణమేంటి. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది.
కేబినెట్ 20వ తేదీ ఉదయమే...
ఏపీ ప్రభుత్వం కీలకమైన మంత్రివర్గ సమావేశం పైన శుక్రవారం మధ్నాహ్యం నుండి సస్పెన్స్ కు కారణమైంది. మూడు రాజధానుల అంశం పైన హైపవర్ కమిటీ నివేదిక పైన ఈ నెల 18న తొలుత కేబినెట్ నిర్వహించాలని..20న అసెంబ్లీ ఏర్పాటు చేసి..మూడు రాజధానుల అంశం పైన చర్చించాలని తొలుత భావించింది. అయితే, ఆ తరువాత నిర్ణయం మార్చుకుంది. 20వ తేదీ ఉదయమే కేబినెట్ సమావేశం నిర్వ హించి..ఆ వెంటనే ఆ బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించాలని నిర్ణయించింది. కానీ, ఆకస్మికంగా శనివారం మధ్నాహ్నమే మంత్రివర్గ సమావేశం అంటూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు మంత్రులు..అధికారులక సమాచారం ఇచ్చింది. కానీ, అనేక తర్జన భర్జనల తరువాత రాత్రి పొద్దు పోయిన తరువాత తిరిగి ముందుగా నిర్ణయించిన ప్రకారమే సోమవారం ఉదయం కేబినెట్..ఆ తరువాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
సాంకేతిక అంశాలపైనే అనుమానం..
శనివారం మధ్నాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహించి..అందులో హైవపర్ కమిటీ నివేదికను ఆమోదించిన తరువాత అసెంబ్లీలో ప్రవేశ పెట్టటానికి మధ్యలో సమయం ఉంటుంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తు న్న వారు ఈ సమయాన్ని న్యాయపరంగా అడ్డుంకులు కలిగించేందుకు వినియోగించుకొనే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అయతే, ఇప్పుడు సీఆర్డీఏ బిల్లును సభలో ప్రవేశ పెట్టి ఆమోదించే అంశం పైన న్యాయ పరంగా చర్చలు సాగుతున్నాయి. ఇది ద్రవ్య బిల్లు కిందకు వస్తుందా..లేక సాధారణ బిల్లు అనే అంశం పైనా చర్చ సాగింది. ద్రవ్య బిల్లు అయితే కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశ పెట్టే ముందే గవర్నర్ ఆమోదం తీసుకోవాలి. కానీ, చర్చల తరువాత ఇది ద్రవ్య బిల్లు కాదని.. నేరుగా సోమవారం కేబినెట్లో ఆమోదించి, వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చుననే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో..సోమవారమే కేబినెట్ లో దీనికి ఆమోద ముద్ర వేయాలని నిర్ణయించారు.
న్యాయపరమైన చిక్కులపైనా..
హైపవర్ కమటీ నివేదిక..కేబినెట్ లో ఆమోదం..అసెంబ్లీలో ప్రతిపాదన అంశాల పైన న్యాయ పరంగా చిక్కులకు ఉన్న అవకాశాల పైనా ప్రభుత్వంలో తర్జన భర్జన సాగుతున్నట్లు సమాచారం. అమరావతి మార్పుపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడఆ లేదు. అందువల్ల కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ శనివారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న పక్షంలో.. వెంటనే దీనిపై ఎవరైనా హైకోర్టును ఆశ్రయించవచ్చు. బిల్లు అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అందువల్లే.. కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశం వెంటవెంటనే ఉండేలా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. అయితే, ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపించిన ప్రభుత్వం..కీలకమైన కేబినెట్ సమావేశం..బిల్లు విషయంలో ఈ తర్జన భర్జనలు అధికార పార్టీలో అయోమయానికి కారణం అవుతున్నాయి. అయితే, అసెంబ్లీ నిర్వహణలో మాత్రం మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు.