కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. రేపటి నుంచే, ఏర్పాట్లు పూర్తి..
కరోనా వైరస్ నివారణలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యత అప్పగించింది. కరోనా వైరస్ వాక్సిన్ కోసం డ్రై రన్ కోసం ఎంపిక చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటి అనే సంగతి తెలిసిందే. దీంతో వాక్సిన్ ట్రయల్ రన్కు కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఆదివారం నుంచి మూడు రోజులు నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.
Recommended Video
డ్రై రన్..
ఈ నెల 27వ తేదీ ఆదివారం ఐటీ రిలేటెడ్ డ్రై రన్, 28వ తేదీ సోమవారం లాజిస్టిక్ రిలేటెడ్ మాక్ డ్రిల్, 29వ తేదీ మంగళవారం వాక్సినేషన్ ట్రయిల్ రన్ నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కో-విన్ అప్లికేషన్ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని పేర్కొన్నారు. యూకే నుంచి 230 మంది జిల్లాకు వచ్చారని, 122 మందికి కరోనా పరీక్ష చేశామని కలెక్టర్ తెలిపారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. శాంపిల్ను పుణే ల్యాబ్కి పంపించామని వివరించారు.
కృష్ణా జిల్లా ఎంపిక
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్కు వైద్యారోగ్య శాఖ కృష్ణా జిల్లాను ఎంపిక చేసింది. డ్రై రన్ కోసం జిల్లాలోని ఐదు ప్రాంతాలను ఎంపిక చేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుహాసిని తెలిపారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఉప్పులూరు పీహెచ్సీ, విజయవాడ పూర్ణ ప్రైవేట్ ఆస్పత్రి, ప్రకాష్నగర్ అర్బన్ పీహెచ్సీ, తాడిగడప ప్రభుత్వ పాఠశాలలో డ్రైరన్కు ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ తరహాలో వ్యాక్సిన్ డ్రై రన్కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రం తరహాలో ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసినట్టు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో ఏపీకి చోటు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ కోసం పంజాబ్, అసోం, గుజరాత్తో ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డ్రై రన్ ఎలా నిర్వహించాలో కేంద్రం ప్రత్యేక సూచనలు చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ రన్ కోసం కృష్ణా జిల్లాను ఎంపికచేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గల కమిటీ పర్యవేక్షణలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.