కరోనా భయాలు - ఏపీలో నిత్యావసరాల షాపింగ్ మరింత కఠినం .. గళ్లు, క్యూ లైన్లలోనే కొనుగోళ్లకు అనుమతి..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ విరామ సమయంలో ఉదయం షాపింగ్ కోసం ప్రజలు విపరీతంగా ఎగబడుతున్న కారణంగా కరోనా సోకకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం ఇకపై ఉదయం షాపింగ్ చేసే వారు నిర్ణీత గళ్లు క్యూలైన్లలో ఉండి కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది.
ఉదయం షాపింగ్- కరోనా భయాలు..
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా వచ్చే నెల 15 వరకూ లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ నిత్యావసరాల కొనుగోళ్లు జరుపుకునేందుకు ప్రజలకు అనుమతిస్తోంది. అయితే భవిష్యత్తులో స్టాక్ ఉంటుందో లేదో అన్న భయాలతో ఈ సమయాల్లో రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతోపాటే కరోనా వైరస్ ప్రబలే ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే ప్రజలను ఏదో ఒక సమయంలో నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతించక తప్పని పరిస్ధితి. దీంతో ఇటు అధికారులు, అటు జనానికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఇకపై గళ్లు, క్యూలైన్లలో కొనుగోళ్లు చేయాల్సిందే..
లాక్ డౌన్ నేపథ్యంలో ఉదయం షాపింగ్ లో ప్రజలు భారీగా తరలివస్తున్న కారణంగా కరోనా ప్రబలే అవకాశాలు ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఇవాళ మరిన్ని కఠిన నిర్ణయాలు సిద్ధమైంది. ఇకపై ఉదయం షాపింగ్ జరిగే రైతుబజార్లతో పాటు ఇతర అన్ని ప్రాంతాల్లోనూ గళ్లను మార్కింగ్ చేస్తున్నారు. ఈ గళ్లలో నిలబడి, క్యూలైన్ అనుసరిస్తూ కొనుగోళ్లు జరిపేలా ప్రజల్లో అవగాహన తీసుకు రానున్నారు. అంటే ఇకపై ఎవరి గళ్లో వారు ఉండి షాపింగ్ చేయాల్సిందేనన్నమాట. లేకపోతే పోలీసుల చర్యలు తప్పవు.
అసలు భయం వారితోనే..
ఇప్పటికే ఏపీకి విదేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు చేరుకున్నారు. వీరిలో చాలా మందిని ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ గా తేలినా, చాలా మందికి నెగెటివ్ వచ్చింది. అయితే మరికొందరు మాత్రం క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. అలాగే వివిధ మార్గాల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. ఇప్పుడు వీరంతా ఉదయం షాపింగ్ కోసం వచ్చి సాధారణ జనానికి ఎక్కడ కరోనా వైరస్ అంటిస్తారో అన్న భయం ప్రభుత్వానికి నానాటికీ ఎక్కువవుతోంది. ఇవాళ్టి నుంచి సమగ్ర సర్వేకు ఆదేశించడం వెనుక ఉద్దేశం కూడా అదే. దీంతి ఇలాంటి వారి నుంచి సాధారణ ప్రజలను రక్షించేందుకు వీలుగా ఉదయం షాపింగ్ జరిగే ప్రాంతాల్లో గళ్లను గీస్తున్నారు. దీంతో ప్రజలు ఎవరికి నిర్దేశించిన గడిలో వారు ఉండి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కరోనా ప్రబలే అవకాశాలు కొంతమేర తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Recommended Video