చంద్రబాబు కు కొత్త టెన్షన్: 14 ఏళ్ల స్టే తొలిగింపు..విచారణ షురూ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన నమోదైన కేసులో 14 ఏళ్ల క్రితం ఇచ్చిన స్టే తొలిగించారు. ఆయన పైన నమోదైన ఫిర్యాదుపై విచారణకు కోర్టు అంగీకరించింది. సివిల్..క్రమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదన సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుతో..చంద్రబాబు స్టే గడువు ముగిందని..ఆ స్టే కు ఎలాంటి పొడిగింపు లేకపోవటాన్ని న్యాయమూర్తి స్పష్టం చేసారు. దీంతో..చంద్రబాబు కేసులో స్టే తొలగటం తో 14 ఏళ్ల తరువాత కేసు విచారణకు వచ్చింది. మొత్తం పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.
జగన్ పగ తీర్చుకుంటున్నారు: చంద్రబాబు ముద్ర లేకుండా: పవన్..నాగబాబు ఆగ్రహం..!
చంద్రబాబు కేసులో స్టే తొలిగింపు..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. దాదాపు 14 ఏళ్ల కిందట విధించిన స్టే తొలిగించారు. దీంతో.. ఈ కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ గతంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కేసు దాఖలు చేసారు. దీనిపైన అప్పట్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆ స్టే తొలిగిపోయినట్లుగా పేర్కొన్నారు. స్టే ఉత్తర్వులకు పొడిగింపు కోరకపోవటంతో ఏసీబీ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో పిటీషనర్ అయిన లక్ష్మీ పార్వతి వాంగ్మూలం కూడా కోర్టు నమోదు చేయనుంది.
సుప్రీం కోర్టు తీర్పుతో ముందుకు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రాజకీయంగానూ స్టేల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసి న ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీ కరించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు.
14 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే..
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని.. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తున్నప్పుడు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం పరిపాటి.. అయితే చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.
Recommended Video
వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే..
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లక్ష్మీ పార్వతి ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఇక, చంద్రబాబు రిట్ పిటీషనర్ దాఖలు చేయటంతో దాని పైన విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి గోవర్థన్రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి హాజరుకు ఆదేశాలిచ్చి విచారణ వాయిదా వేశారు. ఆ తరువాత ..తిరిగి ఇప్పుడు చంద్రబాబు కేసులో విచారణ మొదలైంది.