కృష్ణాజిల్లాలో మళ్లీ కరోనా విజృంభణ- ఒకే రోజులో అత్యధిక కేసుల రికార్డు...
కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో చివరి స్ధానంలో ఉంటూ వచ్చిన కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా మళ్లీ వైరస్ విజృంభించింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో 545 కేసులతో కృష్ణాజిల్లా చివరి నుంచి నాలుగో స్దానానికి చేరుకుంది. ఇది ఇప్పటివరకూ జిల్లాలో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల రికార్డు కూడా. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో అత్యల్ప కేసులతో సాగిపోతున్న జిల్లాగా రికార్డుల్లో ఉన్న కృష్ణాలో ఇంత భారీ స్ధాయిలో కేసులు నమోదు కావడంతో తిరిగి కంటైన్మెంట్ జోన్ల పెంపుతో పాటు ఇతర ఆంక్షలు అమలు చేస్తున్నారు.
చివరి స్ధానంలో కృష్ణాజిల్లా...
కరోనా ఉధృతి ఆరంభమైన కొత్తలో వైరస్ వ్యాప్తి అథ్యధికంగా జరిగిన జిల్లాల్లో కృష్ణాజిల్లా కూడా ఒకటి. పొరుగునే ఉన్న గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశంలోనూ కరోనా వ్యాప్తి రికార్డులు సృష్టిస్తున్నా కృష్ణాజిల్లా మాత్రం ఇన్నాళ్లూ చివరి స్ధానంలోనే ఉంటూ వచ్చింది. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చూసుకున్నా కనీసం 20 వేల కేసులు కూడా దాటని ఏకైక జిల్లా కృష్ణా మాత్రమే. రాజధాని ప్రాంతంగా ఉన్న కృష్ణాజిల్లాలో కరోనా వ్యాప్తి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఆరంభంలో రావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. లాక్డౌన్ను సైతం కఠినంగా అమలు చేశారు. దీంతో కేసుల సంఖ్యలో ఇప్పటికీ చివరి స్ధానంలోనే ఉంది.
అనూహ్యంగా విజృంభణ...
కరోనా కేసుల సంఖ్యలో రోజువారీ చూసినా ఇప్పటివరకూ చివరి స్ధానంలో ఉంటూ వచ్చిన కృష్ణాజిల్లా నిన్న ఒక్క రోజులోనే ఏకంగా మూడు స్ధానాలు ఎగబాకింది. జిల్లాలో తాజాగా నమోదైన 545 కేసులు ఇప్పటివరకూ ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులంటే జిల్లాలో కరోనాను అధికారులు ఏ స్ధాయిలో కట్టడి చేశారో అర్దం చేసుకోవచ్చు. కానీ నిన్న అనూహ్యంగా మారిన పరిస్ధితితో అధికారులు కూడా బెంబేలెత్తుతున్నారు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ నుంచి సమగ్రంగా డేటా తెప్పించుకుని విశ్లేషించే పనిలో పడ్డారు. గతంలో విజయవాడ నగరంలోనే అత్యదిక కేసులుండగా.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కేసులు నమోదైనట్లు ప్రాదమిక అంచనాలను బట్టి తెలుస్తోంది.
Recommended Video
కొత్తగా 23 కంటైన్మెంట్ జోన్లు...
జిల్లాలో అనూహ్యంగా కేసుల విజృంభణ నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి వాటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేయాలని స్ధానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ 431 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించినట్లయింది. వీటిలో 3 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఇవాళ్టి నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటికి రావొద్దని, స్ధానిక అధికారులకు సహకరించాలని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.