ఆలయ ప్రాంగాణల్లో కోవిడ్ సెంటర్లు..వారికి మాత్రమే: కన్నాకు మంత్రి వెల్లంపల్లి ఘాటు రిప్లై
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత, ఆసుపత్రులు, పడకల కొరతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని కొన్ని ప్రధాన దేవాలయాలకు చెందిన ధర్మసత్రాలు, కాటేజీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. రాజకీయ దుమారానికి దారి తీసింది. హిందూ ఆలయాల్లో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కన్వెన్షన్ సెంటర్లు, విద్యాసంస్థలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూరకంగా హిందువుల మనోభావాలను అగౌరపరిచడానికే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
Humanity: కర్ణాటక కరోనా పేషెంట్లకు అనంతపురంలో ట్రీట్మెంట్: ఆసుపత్రులకు తాకిడి
వారికి మాత్రమే పరిమితం..
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీనికి ఘాటుగా బదులిచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో సీనియర్ అయినప్పటికీ.. అసమగ్ర సమాచారాన్ని సేకరించడంలో దిట్టగా ఎద్దేవా చేశారు. ఆలయాలకు చెందిన ధర్మసత్రాలు, కాటేజీల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లను దేవాదాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులు వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం చేశామని గుర్తు చేశారు. నిష్ఠగా ఉండే అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు సాధారణ కోవిడ్ సెంటర్లలో చికిత్స నిర్వహించకూడదనే కారణంతోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు.
మానవత్వానికి మతం రంగు వద్దు..
దేవాదాయ ఉద్యోగులు, సిబ్బంది, అర్చకుల విజ్ఙప్తిని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగాణలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చామని వివరించారు. ఈ చర్యను అభినందించాల్సింది పోయి..తప్పు పట్టడం, విమర్శలు గుప్పించడం, మతం రంగు పులమడానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు. ఇప్పటిదాకా కన్నా లక్ష్మీనారాయణ మీదున్న సదభిప్రాయం ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్యలతో పోయిందని చెప్పారు. తాము దేవాలయాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చట్లేదని, ఆలయాల ప్రాంగణాల్లో ఉన్న కాటేజీలు.. సత్రాల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు రూ.2 లక్షలు..
దేవాదాయ సిబ్బంది, అర్చక కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడానికి తమ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలను ఇస్తోందని వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ నేతలకు క్షవరం అయినప్పటికీ.. వివరం తెలుసుకోకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మత రాజకీయాలు చేయొద్దంటూ కన్నా లక్ష్మీనారాయణకు హితవు పలికారు. పౌష్టికాహారాన్ని అర్చకులు, ఆలయ సిబ్బందికి అందిస్తున్నామని, నెలవారీ వేతనాలు చెల్లించే ప్రాతిపదికన పదవీ విరమణ చేసిన సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆ కోవిడ్ కేర్ సెంటర్లు కొనసాగుతున్నాయని అన్నారు.
మొత్తం 11 ఆలయాల ధర్మసత్రాల్లో కోవిడ్ సెంటర్లు..
కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దాని బారిన పడిన ఆలయ అర్చకులు, సిబ్బంది కోసం జగన్ సర్కార్.. దేవాలయాల ధర్మసత్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం, అనకాపల్లి శ్రీకనకమహాలక్స్మి అమ్వమారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి, అదే జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానాలు, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, శ్రీకాళహస్తిశ్వర దేవస్థానాలు, అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానాలకు సంబంధించిన ధర్మసత్రాలు, కాటేజీల్లో పరిమితంగా కోవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.