సీపీఎస్ రద్దు చేస్తాం .. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు పనిచేయాలన్న బొత్స
అమరావతి/ విజయనగరం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇచ్చిన హామీల విషయంలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దుకు జగన్ సర్కార్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టంచేశారు. ఆయన మంగళవారం విజయనగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎస్ రద్దు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మంత్రి పదవులు రాలేదని.. మైనంపల్లి అలా.. జోగు రామన్న ఇలా..!
సీపీఎస్ రద్దు చేస్తాం కానీ ..
ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కానీ ఉద్యోగులు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని తేల్చిచెప్పారు. గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇందులో భాగంగానే భారీగా నియామకాలు చేస్తున్నామని గుర్తుచేశారు. అంతే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. కొందరు పనిగట్టుకొని చేస్తున్న ఆరోపణలను విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు.
నివేదిక తర్వాతే ..
ఆయా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిందని తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి .. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. అయితే తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని .. వీటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారిని తొలగిస్తున్నారనేది తప్పుడు ప్రచారం అని స్పష్టంచేశారు. ఆయా ఉద్యోగులను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. ఉద్యోగులను తొలగించబోమని సీఎం జగన్ .. మంత్రులతో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు జరుగుతాయే తప్ప ... తీసేయడం ఉండబోదని తేల్చిచెప్పారుజ
ఫ్రెండ్లీ గవర్నెన్స్ ..
రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి బొత్స గుర్తుచేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. తమది స్నేహపూర్వక ప్రభుత్వమని నొక్కి వక్కాణించారు. గత ప్రభుత్వ పాలనలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి కాపాడేందుకు జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని వివరించారు. రాజ్యాంగాన్ని అనుసరించి పాలిస్తున్నామని .. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అందరికీ జవాబుదారీగా పనిచేస్తోందని బొత్స అభిప్రాయపడ్డారు. మరో ప్రశ్నకు తావులేదన్నారు. గోబెల్స్ ప్రచారాన్ని విశ్వసించొద్దని మరోసారి సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.