కూలుస్తారా..కూల్చమంటారా: చంద్రబాబు-లింగమనేని నివాసమే నెక్స్ట్: షోకాజ్ నోటీసులు..!
కరకట్ట అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ముందకే వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రజావేదికను కక్ష్య సాధింపుల్లో భాగంగానే కూల్చేసారనే ఆరోపణల నడుమ..ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో..కరకట్ట మీద నిబంధనలకు వ్యతిరే కంగా ఉన్న అన్ని కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని..వారి నుండి సమాధానం కోసం వారం రోజులే గడువు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న లింగమనేని అతిధి గృహం సైతం ఉంది. దీంతో..ఇప్పుడు లింగమనేని ఎటువంటి సమాధానం ఇస్తారు..ఆ నివాసం విషయంలో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
Recommended Video
కరకట్ట ఆక్రమణదారులకు నోటీసులు..
కృష్ణానదీ కరకట్ట లోపల అక్రమంగా నిర్మించారనే కారణంతో ప్రజావేదికను కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు మిగిలిన అక్రమ నిర్మాణాల పైనా దృష్టి సారించింది. ఇటువంటి కట్టడాలు ఉంటే వాటి విషయంలో కఠినంగా వ్యవహరించమని సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. దీంతో..2015లో జారీ చేసిన నోటీసులు ప్రస్తావిస్తూ మరోసారి వాటి యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు సీఆర్డీఏ సిద్దం అవుతోంది. మొత్తం అక్రమంగా నిర్మించిన వాటి వివరాలతో సహా యజమానులు ఏ రకంగా నిబంధనలు ఉల్లంఘించారు..ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ నోటీసుల్లో వివరించే అవకాశం ఉంది. వారు ఆ నిర్మాణాల విషయంలో ఏం చేయబోతున్నారో వివరిస్తూనే..నిర్మాణ దారులకు వారం రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లోగా వారు తిరిగి సీఆర్డీఏకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దీని పైన వారు ఇచ్చే సమాధానం ఆధారంగా సీఆర్డీఏ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు నివాసానికి సైతం..
ప్రజావేదిక కూల్చగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి గురించి చర్చ మొదలైంది. మాజీ సీఎం నివాసం ఉంటున్న భవనం సైతం నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిందేనంటూ అధికారులు తేల్చినట్లుగా సమాచారం. రాష్ట్ర విభజన తరువాత 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నదీ తీరాన ఉన్న లింగమనేని ఇంటిని లీజుకు తీసుకొని అందులో నివిస్తున్నారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం ఇది అద్దెకు ఉంటున్నారంటూ చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు ఆ నివాసంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇప్పుడు అందరితో పాటుగా లింగమనేనికి సైతం నోటీసు ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. నోటీసులకు భవన యజమాని గా లింగమనేని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఏకాభిప్రాయం కుదిరేనా: ఇద్దరు ముఖ్యమంత్రుల కీలక సమావేశం: అయిదు ప్రధానా అంశాలే అజెండా..!
వారంలోగా తేల్చకుంటే..కూల్చివేతేనా..
సీఆర్టీఏ అధికారులు జారీ చేసే నోటీసుల విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పనున్నట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. అయితే, మిగిలిన భవనాల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు ఇంటి విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. ప్రభుత్వం చంద్రబాబు నివాసాన్ని సైతం కూల్చి వేసే ప్రయత్నం చేస్తే..దానిని రాజీకయంగా వాడుకోవాలని..సానుభూతి పొందేలా వ్యవహరించాలని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం..లింగమనేని చర్యల మీదే నెలకొని ఉంది.