జగన్ తో పాటు గవర్నర్ , మాజీ న్యాయమూర్తి కనగరాజ్ కూడా టార్గెట్ ..కోర్టు తీర్పు ప్రతిపక్షాలకు అస్త్రం
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఒకపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతోషంలో ఉన్న వైసీపీ శ్రేణులకు కోర్టు ఇచ్చిన షాక్ దిమ్మతిరిగేలా చేసింది. ఇక దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న జగన్,కేసీఆర్ లకే ఆయన ఆశీస్సులు : లక్ష్మీ పార్వతి
సీఎం జగన్ నిర్ణయాలపై అక్షింతలు వేస్తున్న హైకోర్టు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్నఅనేక నిర్ణయాలపై హైకోర్టు అక్షింతలు వేసింది. ఉదాహరణకు గ్రామ సచివాలయాలకు,ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేసింది ఏపీ సర్కార్. అయితే ఆ రంగులు తొలగించాలని కోర్టు ఏపీ సర్కార్ ను ఆదేశించింది . ఇక ఇటీవల ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.ఆ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏ మాధ్యమంలో చదవాలో ఎంచుకునే హక్కు విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకు ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన కోర్టు
ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తీవ్రంగా తప్పు పడుతుంది. ఇదే క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో కూడా హైకోర్టు వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ఇక హైకోర్టు ఇచ్చిన షాక్ తో ఏపీ లోని అధికార వైసిపితో పాటు, రమేష్ కుమార్ ని తొలగిస్తున్న ఆర్డినెన్స్ ను ఓకే చేసిన గవర్నర్, ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ కూడా విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది .
ఆర్డినెన్స్ పై సంతకం చేసి ఆమోదం తెలిపిన గవర్నర్ పై ఏపీలో చర్చ
ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆర్డినెన్స్ ఇచ్చిన గవర్నర్, అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలిచి పదవి ఇవ్వగానే నిబంధనలు తెలిసి కూడా పదవి తీసుకున్న మాజీ న్యాయమూర్తి కనగరాజ్పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించే పరిస్థితి లేకపోలేదు. గవర్నర్ రాజ్యాంగాధిపతిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించాలి. రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూడాలి. కానీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎస్ఈసీగా ఉన్న రమేష్కుమార్ ను తొలగించడానికి, కొత్త ఎస్ఈసీగా కనగరాజ్ను నియమించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.ప్రభుత్వం నుంచి అలా ఫైల్ రాగానే వెంటనే ఆమోదించి సంతకం పెట్టేశారు.
అడకత్తెరలో పోకచెక్కలా మారిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ పరిస్థితి
సహజంగా ఇలాంటి వివాదాస్పద అంశాల విషయంలో రాజ్యాంగ నిపుణుల సలహాల మేరకే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ అలా కాకుండా ఎలాంటి న్యాయ, రాజ్యాంగ సలహాలు తీసుకోకుండా సంతకం పెట్టేసిన గవర్నర్ పై కూడా హైకోర్టు తీర్పుతో చర్చ జరుగుతోంది. హైకోర్టు నిమ్మగడ్డ రామ్మోహన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించిన ఆర్టికల్ 213 ప్రకారం.. ఆర్డినెన్స్ చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇది కీలకం కానుంది. ఇక ఇదే క్రమంలో మాజీ న్యాయమూర్తి కనగరాజ్ రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ గురించి తెలిసి ఉండి మరీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆఫర్ ఇవ్వగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక తాజాగా కోర్టు తీర్పుతో కనగరాజ్ మీద కూడా విమర్శలు వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
Recommended Video
వైసీపీ ఏడాది పాలన పూర్తి సమయంలో షాక్ .. ప్రతిపక్షాలకు ఆయుధం
ఏది ఏమైనా ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు జగన్ సర్కార్ కు రివర్స్ షాక్ కొట్టడమే కాకుండా, సదరు నిర్ణయాలకు బాధ్యులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్ తదితరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇక ఏడాది పాలన సందర్భంగా సంతోషంలో ఉన్న జగన్ పార్టీ ఇప్పుడు ఈ కోర్టు తీర్పును డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇక ఈ వ్యవహారం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ప్రతిపక్ష పార్టీల చేతికి ఆయుధమైంది.