బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న వైఎస్ జగన్: కారణం? మూలా నక్షత్రం నాడే
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా దసరా వేడుకలు వైభవంగా ఆరంభం కాబోతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు సందడి మొదలు కాబోతోంది. దసరా ఉత్సవాలతో పాటు కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16వ తేదీన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతుండగా.. ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా దసరా పండుగ వాతావరణం నెలకొనబోతోంది.
దసరా మహోత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ముస్తాబవుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా భక్తులకు ఆలయాల్లో అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. రోజూ నాలుగు నుంచి అయిదు వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మూలా నక్షత్రం నాడు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఆయన దుర్గగుడికి చేరుకుంటారు.వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఇది రెండోసారి అవుతుంది. గత ఏడాది వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కృష్ణాజిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వెంట ఈ వేడుకల్లో పాల్గొనంటారని తెలుస్తోంది. అనంతరం వైఎస్ జగన్ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గరుడ సేవ నాడు తిరుమలకు వెళ్తారని సమాచారం. గరుడ సేవ నాడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే అవకాశం ఉంది.