ఆ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్ .. ఎప్పుడూ కంపే : కొడాలి నానీపై దేవినేని ఉమా ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతోంది. హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీమంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేశారు.
నందిగామ నగర పంచాయతీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన, కృష్ణా జిల్లాలో ఒక బూతుల మంత్రి ఉన్నాడంటూ కొడాలి నాని ని టార్గెట్ చేశారు.
బాలకృష్ణ ఆటలో అరటిపండు , చంద్రబాబు శనిగ్రహం : ఉతికారేసిన మంత్రి కొడాలి నాని
చంద్రబాబుపై కొడాలి నానీ వ్యాఖ్యలపై మండిపడిన దేవినేని ఉమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పర్వంలో కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబు ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. గుడివాడ నుంచి పోటీ చేసి చంద్రబాబు గెలవాలని సవాల్ చేశారు. చంద్రబాబు ఒక నీచుడు అంటూ నిప్పులు చెరిగారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశారంటూ మండిపడ్డారు . దేవుడులాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు . చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కొడాలి నాని ని టార్గెట్ చేసి టిడిపి నేత దేవినేని ఉమ మండిపడ్డారు.
ఓ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్ అని పరోక్షంగా కొడాలి నానిపై వ్యాఖ్యలు
కృష్ణా జిల్లాలో ఉన్న ఓ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్ అని పరోక్షంగా కొడాలి నానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆ మంత్రి నోరు నిరంతరం కంపు కొడుతూనే ఉంటుందని ఎద్దేవా చేసిన దేవినేని ఉమా, 14 సంవత్సరాలుగా సీఎంగా పనిచేసిన వ్యక్తి పై కొడాలి నాని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మనిషి అనే వాడు అలా మాట్లాడతాడా అంటూ ప్రశ్నించారు.
ఇదే సమయంలో ట్విట్టర్ వేదికగా మహిళా దినోత్సవం రోజున అమరావతి మహిళా రైతులపై దాడి ఘటనపై మండిపడ్డారు దేవినేని ఉమా.
రాజధాని మహిళలపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఫైర్
మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించి లాఠీలు ఝుళిపించటం వైయస్ జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్న దేవినేని ఉమా ఈ దుస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ప్రకటించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.