వైఎస్ జగన్కు ప్రధాని మోడీ ఫోన్: అగ్ని ప్రమాదంపై ఆరా: స్పందించిన అమిత్ షా, గవర్నర్
విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు, ప్రభుత్వం తీసుకుంటోన్న సహాయక చర్యల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించడం పట్ల నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
Recommended Video
తొమ్మిది మంది మరణానికి దారి తీసిన ఘటనపై
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట నలుగురు మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ సంఖ్య ఏడుకు పెరిగింది. తాజాగా మరో ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు. దీనితో స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
కలచి వేసిందంటూ ప్రధాని ట్వీట్..
ఈ ఘటన తనను కలచి వేసిందని ప్రధానమంత్రి చెప్పారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. తమ కుటుంబంలో ఆప్తుడిని కోల్పోయిన వారి ఆవేదనను తీర్చలేమని అన్నారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే వైఎస్ జగన్తో మాట్లాడానని మోడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
కోవిడ్ సెంటర్లలో ప్రమాదాలు ఆందోళనకరం..
అగ్నిప్రమాద ఘటన పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని అన్నారు. మృతుల కుటంబాలకు ఆయన సానుభూతిని తలిపారు. గాయపడ్డ వారు శరవేగంగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. ఇటీవలే గుజరాత్లోని అహ్మదాబాద్లో గల శ్రేయ్ ఆసుపత్రిలో సంభవించిన ఉదంతాన్ని అమిత్ షా పరోక్షంగా గుర్తు చేశారు.
అత్యవసర వైద్య సహాయాన్ని అందించండి..
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీన్ని అవాంఛనీయ సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని గవర్నర్ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.