దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు .. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య
విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని మృతి కేసులో రోజుకో రకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్య తేజస్విని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వారం రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన నేపథ్యంలో దర్యాప్తులో దూకుడు పెంచారు పోలీసులు.
దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్
పక్కా ప్లాన్ ప్రకారమే దివ్య హత్య
ఇప్పటికే ఈ కేసులో పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్య హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు నాగేంద్ర కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు, హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు నాగేంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణలో నాగేంద్ర స్నేహితుడు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. హత్య చేసే ముందు తనకు ఫోన్ చేసిన నాగేంద్ర కాసేపట్లో దివ్య తేజస్విని ఇంటి దగ్గరికి రావాలని కోరినట్టు అతను పోలీసులకు తెలిపారు.
నాగేంద్రనే హంతకుడని నిర్ధారించిన పోలీసులు
అయితే అతను వచ్చేసరికి రక్తపుమడుగులో ఉన్న దివ్య తేజస్విని ని ఆస్పత్రికి తరలించేందుకు దివ్య కుటుంబ సభ్యులు కిందికి తీసుకువస్తున్నారని, లోపలికి వెళ్ళి చూస్తే నాగేంద్ర కూడా రక్తపుమడుగులో ఉండటం చూశానని అతను పోలీసులకు తెలిపారు. నిందితుడు నాగేంద్ర దివ్య తేజస్విని ఇంటికి కాస్త దూరంలో తన బైక్ ను పెట్టాడని తెలుస్తుంది. సంఘటన స్థలంలో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు నాగేంద్ర నే హంతకుడిని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కేసును విచారిస్తున్న దిశా పోలీసులు
త్వరితగతిన ఈ కేసును విచారించడం కోసం రంగంలోకి దిగిన దిశా పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు కుటుంబ సభ్యులతో పాటుగా ఇంటి పక్కన ఉన్న వారిని, దివ్య స్నేహితులను కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో అధికారులు శాస్త్రీయ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ కేసును దిశా పోలీస్ స్టేషన్ కు తరలించటంతో అక్కడ అధికారులు యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టారు.
నేడు సీఎం జగన్ ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
దివ్య తేజస్విని, తాను పెళ్లి చేసుకున్నామని , దివ్య ఇంట్లో తల్లిదండ్రులు వారి పెళ్లిని అంగీకరించకపోవడంతోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఎవరు గొంతు వారే కోసుకున్నామని నిందితుడు నాగేంద్రబాబు చెప్పారు. అదంతా అబద్ధమని ఆమె తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్యతేజస్విని తల్లిదండ్రులు నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు . మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా, తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని వారు హోం మంత్రిని కోరిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలవటానికి ఏర్పాట్లు చేశారు .