కాలేజీ విద్యార్థులే టార్గెట్.. విజయవాడలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
విజయవాడ : డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు డీసీపీ హర్షవర్దన్. శనివారం నాడు నిఘా పెట్టి డ్రగ్స్ ముఠా ఆట కట్టించినట్లు తెలిపారు. ఈ ముఠా విజయవాడ, గుంటూరు కేంద్రంగా డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలతో పాటు కాలేజీ విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్న ఈ ముఠాను వల వేసి పట్టుకున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్ ముఠా సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో డ్రగ్స్ చాలా ఈజీగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇటీవల విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా డ్రగ్స్ ముఠా రెచ్చిపోతుందనే పక్కా సమాచారంతో పోలీసులు వల వేసి పట్టుకున్నారు.
50 శాతం ఓట్లు మాకేనంటూ.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ.. కేటీఆర్ ఫుల్ ఖుషీయా?
నిందితుల నుంచి రెండున్నర కిలోల గంజాయి, 14 గ్రాముల డ్రగ్స్, ఒక టూ వీలర్, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ మీడియాకు వివరించారు. ప్రధానంగా ఈ ముఠా సభ్యులు కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో దాడి చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠాలో శ్రీకాంత్, అనంత్ కుమార్ కీలక వ్యక్తులని చెప్పారు. టాంజానియా దేశానికి చెందిన లిస్వా శాబన్, సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ రసూల్ కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ముఠా సభ్యులు బెంగళూరు నుంచి దాదాపు 2 వేల రూపాయలకు డ్రగ్స్ కొంటారని.. అదే ఇక్కడి ప్రాంతాల్లో 4 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు డీసీపీ వివరించారు. వీరిపై కొంతకాలంగా నిఘా పెట్టడంతో శనివారం నాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని తెలిపారు. విజయవాడలో డ్రగ్స్ కల్చర్ను అణిచివేస్తామని చెప్పుకొచ్చారు. కాలేజీల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పారు.