బెజవాడకు మరో మణిహారం - ఇంజనీరింగ్ అద్భుతం కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తి- ప్రారంభం అప్పుడే..!
ఏపీలో ఆర్ధిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరానికి మరో మణిహారంగా రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైనా ఎన్నో ఆడ్డంకులు, నిధుల సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు దాటుకుంటూ తాజాగా 90శాతంకు పైగా నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో సెప్టెంబర్ రెండో వారంలో దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతంగానూ, అత్యంత పొడవైన నిర్మాణంతో పాటు మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ ఫ్రైఓవర్ గురించి ప్రత్యేక కథనం..
ట్రాఫిక్ బాటిల్నెక్..
విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లాలంటే మధ్యలో కనకదుర్గ గుడి ప్రాంతంలో భారీ ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా గుడికి కొండపైకి వాహనాలు వెళ్లే ప్రవేశద్వారం సమీపంలో పరిస్ధితి మరీ దారుణం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుకైన రోడ్డుతో పాటు పక్కనే ఉన్న కొండలతో జనం నరకయాతన అనుభవించారు. విజయవాడ-హైదరాబాద్ బస్సులు వెళ్లేందుకు కూడా ఇదే ప్రధాన రహదారి కావడంతో నవరాత్రుల సమయంలో మినహా మిగిలిన సమయాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. వర్షాకాలంలో కొండ చరియలు విరిగి పడతాయనే భయాలు ఓవైపు, ఇరుకైన రోడ్డుపై రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించాలంటే ట్రాఫిక్ జామ్ ల మధ్య వాహనదారులు యాతన అనుభవించారు. చివరికి ఫ్లైఓవర్ ప్రతిపాదన రావడం అది ఇన్నాళ్లకు పూర్తి కావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఫ్లైఓవర్ ప్రతిపాదన...
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలోఉంచుకుని ఇక్కడ కనకదుర్గ గుడి ప్రాంతంలో ఓ ఫ్లైవర్ నిర్మించాలని దశాబ్దాల క్రితమే భావించారు. కానీ పక్కనే నది ఉండటం, ఫ్రైవర్ కట్టాలంటే నదికి ఆనుకుని, కొంత మేర నదిపైన ఫ్లైవర్ నిర్మించాల్సిన పరిస్ధితులు ఎదురయ్యాయి. దీంతో ఫ్రైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రాని పరిస్ధితి. చివరికి 2014 తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మించక తప్పని పరిస్ధితి రావడంతో అప్పటి టీడీపీ సర్కరు కేంద్రం సాయంతో జాతీయ రహదారిపై విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకూ 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్దమైంది. ఇందుకోసం రూ.440 కోట్ల రూపాయలు ఖర్చయింది.
ఇంజనీరింగ్ అద్భుతంగా ...
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దాటాక కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న కృష్ణా కాలువపై నుంచి సాగే ఈ ఫ్లైఓవర్ కనకదుర్గ గుడి వద్ద ఏకంగా నదిలోకి వెళ్లిందా అనుకునేలా రూపొందించారు. వాస్తవానికి ఇక్కడ ఉన్న ఇరుకైన మార్గంలో ఇలాంటి ఓ ఫ్లైఓవర్ నిర్మించే అవకాశం ఉందని కూడా జనం ఎప్పుడూ ఊహించలేదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏపీలోనే అత్యంత పొడవైన ఫ్లై ఓవర్గా ఇంజనీరింగ్ అద్భుతంగా దీని నిర్మాణం జరిగింది. పూర్తిగా జాతీయ రహదారిపై ఉన్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చింది. దీంతో ఇప్పుడు కనకదుర్గ గుడి పక్కనుంచి సర్వాంగ సుందరంగా ఈ ఫ్లైఓవర్ రాకపోకలకు సిద్ధమైంది.
రాజకీయాలను అధిగమించి...
వాస్తవానికి ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇన్ని రాజకీయాలుంటాయా అని జనం ఆశ్చర్యపోయే రీతిలో ఇక్కడ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో హైదరాబాద్ నిర్మించినట్లుగా చెప్పుకునే టీడీపీ ఈ ఫ్లైవర్ నిర్మాణం ప్రారంభించే సమయంలో 9 నెలల్లోనే పూర్తి చేస్తామని గొప్పులు చెప్పుకుంది. కానీ కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, టీడీపీ లాబీయింగ్ ఫలించకపోవడం, ఆ తర్వాత ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడం వంటి కారణాలతో ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగాయి. చివరికి వైసీపీ ప్రభుత్వం పచ్చాక కేంద్రంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో నిధుల విడుదలతో పాటు ఇతర సమస్యలను అధిగమించి తాజాగా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో దీని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.