కలెక్టర్కు రూ. కోటి, గ్రామ సచివాలయాల్లో హెల్ప్లైన్: జగన్ సమీక్ష సాగిందిలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి తానేటి వినత, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహిళలకు పౌష్టికాహారం అందించడం, నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో చేరని విద్యార్థులను..
అంగన్వాడీ కేంద్రాల నుంచి పాఠశాలల్లో చేరని విద్యార్థుల వివరాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. సుమారు 7వలే మంది పాఠశాలల్లో చేరలేదని అధికారులు సమాధానమిచ్చారు. అలాంటి విద్యార్థులందర్ని ఆరు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత వారి సామర్థ్యాన్ని బట్టి పాఠశాల తరగతుల్లో చేర్పించాలని జగన్ ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల కోసం ప్రత్యేక యాప్..
అంగన్వాడీ కేంద్రాల కోసం ప్రత్యేక యాప్ తయారు చేయించాలని అధికారులకు సూచించారు జగన్. పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని ఆదేశించారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అంగన్వాడీ వర్కర్లను ప్రోత్సహించాలని, మహిళా శిశు సంక్షేమంలో గ్రామ వాలంటీర్లను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
కలెక్టర్కు రూ. కోటి..
వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన రూ.7.48కోట్ల పరిహారాన్ని గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ఆదేశించారు. ఒక్కో జిల్లా కలెక్టర్కూ రూ. కోటి చొప్పున నిధిని కేటాయించాలని.. ఆ మొత్తాన్ని వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేసేందుకు ఉపయోగించాలని ఆదేశించారు.
హెల్ప్ లైన్..
త్వరలో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల నుంచి వచ్చే అత్యవసర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం ఆదేశించారు. దీని అనుగుణంగా ప్రతి గ్రామ సచివాలయంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. శాఖలు, అధికారుల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు.