విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: ఘటనా సమయంలో 40 మందికి పైగా
విజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 30 మంది కరోనా వైరస్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మరో 10 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
మంటలను అదుపు చేస్తున్నారు. కిటికీలు, ఇతర మార్గాల ద్వారా పేషెంట్లను సురక్షింతగా బయటికి తీసుకొచ్చారు. వారిని వేరే ఆసుపత్రికి తరలించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి. అంబులెన్సుల ద్వారా పేషెంట్లను వేరే ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 30 మంది పేషెట్లు, 10 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పేషెంట్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
Recommended Video
కొద్దిరోజుల కిందటే గుజరాత్లోని అహ్మదాబాద్లో కోవిడ్ కేర్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. అదే తరహా ఉదంతం తాజాగా విజయవాడలో చోటు చేసుకోవడం పట్ల భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సమాచారం అందిన వెంటనే విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పోలీసులతో ఫోనులో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధితులకు సత్వర వైద్యాన్ని అందించాలని ఆయన పోలీసులకు సూచించారు.