ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధం
విజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను మరో వాహనంలో తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఎస్వీకేడీటీ ట్రావెల్స్కు చెందిన మల్టీయాక్సెల్ బస్సు అది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరింది. బస్సులో 35 ప్రయాణికులు ఉన్నారు. ఈ తెల్లవారు జామున బస్సు విజయవాడ రూరల్ మండలం పరిధిలోని ప్రసాదంపాడు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. బస్సు టైర్ పగిలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. పెద్దశబ్దంతో బస్సు టైర్ పగిలడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు నుంచి కిందికి దూకారు. పొగ వెలువడిన కొద్దిసేపటికే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయలు అయ్యాయి. బస్సు టైర్ పగలిన వెంటనే నిప్పురవ్వలు ఇంజిన్పై పడటం వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంజిన్కు డీజిల్ను సరఫరా చేసే పైపులు కాలిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 35 మందిలో ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని పోలీసులు తెలిపారు. కొందరు స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్నారు.