ఉలిక్కిపడ్డ విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం:9 మంది దుర్మరణం
విజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. 30 మంది కరోనా వైరస్ పేషెంట్లను ఇతర కోవిడ్ సెంటర్లో చేర్చారు. ఈ ఘటన పట్ల విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
Recommended Video
రమేష్ ఆసుపత్రి పర్యవేక్షణలో..
గవర్నరు పేటలో ఉందీ స్వర్ణ ప్యాలెస్ హోటల్. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం సందర్శకుల సంఖ్య తగ్గింది. మూత పడే దశకు చేరుకుంది. ఈ హోటల్ భవనాన్ని విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రుల యాజమాన్యం తాత్కాలికంగా తీసుకుంది. దీన్ని కోవిడ్ కేర్ సెంటర్గా మార్చింది. 30 మంది పేషెంట్లు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారు జామున 4:45 నిమిషాల నుంచి 5 గంటల మధ్య కాలంలో ఈ భవనంలో మంటలు చెలరేగాయి.
సైరన్ మోతలతో భీతావహ పరిస్థితులు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కిటికీలు, ఇతర మార్గాల ద్వారా పేషెంట్లను సురక్షింతగా బయటికి తీసుకొచ్చారు. వారిని లబ్బీపేట, బందరు రోడ్లోని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆఅగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంబులెన్సుల ద్వారా పేషెంట్లను వేరే ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శకటాలు, అంబులెన్సుల సైరన్ల మోతలతో స్వర్ణ ప్యాలెస్ హోటల్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి.
షార్ట్ సర్క్యూట్ వల్లే
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నగర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని అన్నారు. అనంతరం అవి ఫస్ట్ ఫ్లోర్కు వ్యాపించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదం సంభవించిందనే విషయంపై తెల్లవారు జామున 5:15 నిమిషాలకు కంట్రోల్ రూమ్కు సమాచారం అందిందని అన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో తాము స్వర్ణ ప్యాలెస్కు చేరుకున్నట్లు తెలిపారు. మెట్ల ద్వారా పేషెంట్లను తరలించడానికి అవకాశం లభించలేదని, దీనితో కిటికీల ద్వారా బయటికి తీసుకొచ్చామని, అగ్నిపమాక శకటాల నిచ్చెనల ద్వారా కిందికి దించామని అన్నారు.
ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దూకిన సిబ్బంది
మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రికి చెందిన కృష్ణారెడ్డి అనే ఉద్యోగి, సెక్యూరిటీ గార్డు ఫస్ట్ఫ్లోర్ నుంచి కిందికి దూకారని శ్రీనివాసులు చెప్పారు. కృష్ణారెడ్డికి గాయాలయ్యాయని వివరించారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని అన్నారు. అత్యవసర ద్వారాలు ఉన్నాయా? లేవా? అనేది తెలుసుకుంటామని, అనంతరం చట్టపరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. నోటీసులను జారీ చేస్తామని చెప్పారు.
ఆరా తీసిన మంత్రి వెల్లంపల్లి
ఈ సమాచారం అందిన వెంటనే విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పోలీసులతో ఫోనులో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధితులకు సత్వర వైద్యాన్ని అందించాలని ఆయన పోలీసులకు సూచించారు. ప్రాణనష్టాన్ని నివారించాలని ఆదేశించారు. నలుగురు మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.