వైఎస్ జగన్ ప్రమాణం! ఆ రకంగా చరిత్రలో నిలిచిపోనున్న విజయవాడ!
విజయవాడ: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో.. రాష్ట్రంలో నూతన శకం ఆరంభం కానుంది. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దీనికి వేదికైంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడం వల్ల సభా ప్రాంగణం స్వల్పంగా చెదిరిపోయినప్పటికీ.. సిబ్బంది దాన్ని యుద్ధ ప్రాతిపదికన యధాతథ స్థితికి తీసుకొచ్చారు. వర్షపు నీరు నిలిచిన చోట ఇసుకను పోసి, బురద లేకుండా చర్యలు తీసుకున్నారు.
చరిత్రలో ఇదే తొలిసారి..
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో.. విజయవాడ ఓ సరికొత్త అధ్యయానికి కేంద్ర బిందువైంది. ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం విజయవాడ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతకుముందెన్నడూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు విజయవాడ వేదికగా నిలిచిన సందర్భాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నీ హైదరాబాద్లోనే చోటు చేసుకునేవి. రాజ్భవన్ లేదా ఎల్బీ స్టేడియంలల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలు ఏర్పాటయ్యాయి.
2014లో కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రబాబు ప్రమాణం
విభజన తరువాత తొలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. ఆ కార్యక్రమానికి విజయవాడ వేదికగా కాలేదు. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి, అత్యంత ఆడంబరంగా నాగార్జున యూనివర్శిటీ సమీపంలోని ఖాళీ స్థలంలో 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఒక్క కార్యక్రమానికి అయిదు కోట్ల రూపాయలను వ్యయం చేశారంటూ అప్పట్లో విమర్శలు చెలరేగినప్పటికీ.. ఖాతరు చేయలేదు చంద్రబాబు.
విజయవాడకు రాజకీయ ప్రాధాన్యత
ఈ సారి తన ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడను ఎంచుకున్నారు వైఎస్ జగన్. మొదట్లో ఆయన తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు నుంచే రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత, చైతన్యం ఉన్న విజయవాడ నగరంలో తాను ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిరాడంబరంగా బాధ్యతలను తీసుకుంటానని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లను పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం.
కమ్యూనిస్టుల కంచుకోట..బెజవాడ
1940వ దశకం ముందు నుంచే విజయవాడలో రాజకీయ చైతన్యం ఉండేది. అప్పట్లో వామపక్ష నాయకులకు విజయవాడ కంచుకోట. పుచ్చలపల్లి సుందరయ్య, రాఘవయ్య వంటి కమ్యూనిస్టు యోధులు విజయవాడను కేంద్రంగా చేసుకుని తమ పోరాటాలను సాగించారు. కొన్ని దశాబ్దాల పాటు విజయవాడ నగరం, లోక్ సభ నియోజకవర్గం పరిధి కమ్యూనిస్టుల కంచుకోటగా కొనసాగింది. ఇప్పటికీ విజయవాడలో దీనికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఏనాడూ ఏ ముఖ్యమంత్రి కూడా తన ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడను ఎంచుకోలేదు. వైఎస్ జగన్ వారందరికీ భిన్నంగా వ్యవహరించారు. విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు.
నగరం.. వాహనమయం
ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా విజయవాడ నగరం మొత్తం వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, వైఎస్ఆర్సీపీ జెండాలతో నిండిపోయింది. వైఎస్ జగన్ భారీ కటౌట్లను ఎక్కడికక్కడ కూడళ్లలో ఏర్పాటు చేశారు. నగరంలోని మొత్తం దారులన్నీ.. నేడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి దారి తీస్తున్నాయి. తెల్లవారు జాము నుంచే జిల్లాల నుంచి వందలాది వాహనాలు విజయవాడకు బారులు తీరాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ సహా తెలంగాణ రాష్ట్రం వైపుగా సాగిపోయే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. వైఎస్ఆర్సీపీ జెండాలను తగిలించుకున్న వాహనాలు వందల సంఖ్యలో విజయవాడ వైపు తరలి వస్తున్నాయి