కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు అవమానం
విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. దసర మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కుటుంబంతో సహా కృష్ణంరాజు ఆలయానికి వచ్చారు. అయితే, తనకు అనారోగ్యంగా ఉందని, ప్రత్యేక క్యూలైన్లో పంపాలని కృష్ణంరాజు కోరినా.. ఆలయ సిబ్బంది పట్టించుకోలేదు.
అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము
దీంతో చేసేదేం లేక ఇతర భక్తులతోపాటు ఆయన కూడా క్యూలైన్లో నిల్చుని.. మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. ఆయాస పడుతూనే క్యూలైన్ నడిచిన ఆయన.. కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.
తనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా.. దేవస్థాన సిబ్బంది పట్టించుకోలేదని కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనాలని, ఇందుకు సమాచారాన్ని దుర్గగుడి సిబ్బందిని అడిగినప్పటికీ వారు ఏమీ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ కేంద్రమంత్రి అయిన కృష్ణంరాజు పట్ల అధికారులు, సిబ్బంది ఇలా ప్రవర్తించడంపై ఆయన కుటుంబసభ్యులు, అక్కడున్న భక్తుులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబం కుంకుమ పూజలో పాల్గొని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోయారు.
ఇది ఇలా ఉండగా, నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటంబసమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దుర్గ గురి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు దివ్యాశీర్వచనాలు అందించగా.. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.
మరోవైపు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దర్శించుకున్నారు. సీఎస్కు వేదపండితులు ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. తొమ్మిదో రోజు కావడం ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి ఎక్కువగా కనిపించింది.