నిపుణుల కమిటీ నివేదికపై గల్లా జయదేవ్ ఫైర్ ..ఆ రైతులను ఏం చేస్తారు ? నిధులేవీ ? అని మండిపాటు
ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతుంది. ఇక ఈ అంశంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చాలా తీవ్రంగా స్పందించారు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని సీఎం జగన్ చేసిన ప్రకటన మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని ఆయన మండిపడ్డారు.
ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? భిన్నవాదనలు
విభజనతో నష్టపోయాం.. ఈ నిర్ణయంతో ఘోరంగా దెబ్బతింటాం అన్న ఎంపీ గల్లా
ఇప్పటికే విభజనతో చాలా నష్టపోయాం అని చెప్పిన గల్లా జయదేవ్ రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్ ను సైతం కోల్పోయామని, ఇప్పుడు సీఎం జగన్ చేసిన ప్రకటనతో మరోమారు రాష్ట్రం నష్టపోతుందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదని గల్లా జయదేవ్ హితవుపలికారు. కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన,ఆ తర్వాత కమిటీ సభ్యులు మాట్లాడిన తీరు అంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందే చేసి పెట్టుకున్న ప్లాన్ అని గల్లా ఆరోపించారు.
ప్రజలు క్యాపిటల్ కోరుతున్నారు క్యాంప్ ఆఫీస్ కాదన్న గల్లా జయదేవ్
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితులను తీసుకు వచ్చిందని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఇక జిఎన్ రావు కమిటీ నివేదికపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా క్యాపిటల్ ఉండాలి అన్న జయదేవ్ రాష్ట్ర ప్రజలు క్యాపిటల్ కోరుకుంటున్నారని క్యాంప్ ఆఫీస్ కాదని మండిపడ్డారు.
జిల్లాకో క్యాంపు కార్యాలయం పెట్టుకోమనండి అంటూ ఎద్దేవా చేసిన గల్లా
ఇక వైసీపీ ప్రభుత్వానికి జిల్లాకు క్యాంపు కార్యాలయం కట్టుకోమని చెప్పండి అంటూ ఎద్దేవా చేసిన గల్లా జయదేవ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, అయితే అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాజధాని రాష్ట్రానికి ఎకనామికల్ గా ఇంజన్ లా ఉండాలి తప్ప ఆర్థిక భారం కాకూడదని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.విశాఖపట్నాన్ని ఫైనాన్సియల్ సిటీగా అభివృద్ధి చేయాలని సూచించిన గల్లా జయదేవ్ అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, క్యాంపు కార్యాలయం, ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్న
30 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూములు ఇస్తే, ఆ భూములు సేకరించటానికి నాటి ప్రభుత్వం చాలా తంటాలు పడింది. భూములు ఇవ్వడానికి మొదట అంగీకరించని రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం చివరకు తమ పంటపొలాలను త్యాగం చేశారు. అప్పటి ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు హామీలు కూడా ఇచ్చింది. అధికారులు ఎవరున్నా అది ప్రభుత్వ హామీనే అవుతుంది అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీ మారిందని నిర్ణయాలు మార్చుకుంటే రైతుల పరిస్థితి ఏంటి అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.
నిపుణుల కమిటీని సీఎం జగన్ ప్రభావితం చేశారని గల్లా ఆరోపణ
ఇక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రెండు ఒకేలా ఉన్నాయ్ అని, సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయం మేరకు నిపుణుల కమిటీని ప్రభావితం చేశారని గల్లా పేర్కొన్నారు. ఇక దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని అలాంటి ఫార్ములాని ఏపీలోనూ అనుసరించాలని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన గల్లా జయదేవ్ సౌత్ ఆఫ్రికా ఫార్ములా ఏపీకి సరిపోదని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఫార్ములాను నెల్సన్ మండేలా అని వ్యతిరేకించారని గుర్తు చేసిన జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అమలు చేయాలని భావిస్తే ఏపీ ఆర్థిక భారంతో కష్టాల ఊబిలో కూరుకు పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.