గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!
విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయటకు తీసుకురావడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. కళ్ల ముందే సదరు యువకుడు ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు పోతుంటే చూడలేకపోయామని.. ఎన్డీఆర్ఎఫ్ బృందం అలర్ట్ కావడంతో అతడు ప్రాణాలతో బయట పడ్డాడని చెబుతున్నారు.
విజయవాడలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతమ్మ వారి పాదాల ఘాట్ దగ్గర కోలాహలం ఏర్పడింది. వినాయక నిమజ్జన పర్వం కనులారా తిలకించడానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. అయితే ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీ జల కళ సంతరించుకుంది. నీటి ప్రవాహం బాగా ఉండటంతో సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)
అయితే గణేశ్ నిమజ్జనం తిలకించడానికి అక్కడకు వచ్చిన ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడిపోయాడు. వరద నీటి ప్రవాహానికి చాలా దూరం కొట్టుకు పోయాడు. అయితే నిమజ్జనం సందర్భంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ బృందం సేవలందిస్తోంది. సదరు యువకుడు నీటిలో పడగానే వారు వెంటనే అలర్టయ్యారు.
వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న సదరు యువకుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందం క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. అతడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.సుధాకర్ గా గుర్తించారు. అయితే ప్రాణాలకు తెగించి ఆ యువకుడిని కాపాడిన తీరుపై ఎన్డీఆర్ఎఫ్ బృందం పట్ల స్థానికులు ప్రశంసలు కురిపించారు.