గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని..కొణకళ్ల నారాయాణకు వంశీతో చర్చించే బాధ్యతలు అప్పగించారు. వారిద్దరూ వంశీతో సుదీర్ఘంగా చర్చించినా...ఫలితం రాలేదు. ఇదే సమయంలో వంశీ వైసీపీలో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు టీడీపీ ఒక వైపు చేస్తుండగానే..నియోజకవర్గం పైన పార్టీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వంశీ పార్టీ వీడి వెళ్లినా..తామంతా టీడీపీలోనే ఉంటామని స్పష్టం చేసారు. నాయకత్వ మార్పు చేయాల్సివస్తే దేవినేని అవినాష్కు గన్నవరం బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. వంశీ తుది నిర్ణయం ప్రకటించిన తరువాత కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.
వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం: ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా, రాజకీయాలకూ గుడ్బై
అవినాశ్ కు బాధ్యతలు అప్పగించాలి..
వల్లభనేని వంశీ టీడీపీలోనే కొనసాగేలా చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ నేతలు వంశీని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం వంశీ మీద అక్రమంగా కేసులు పెట్టారని..వంశీకి పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వంశీతో చర్చల కోసం ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక, వంశీ టీడీపీలో కొనసాగే అవకాశం లేదని తేల్చి చెబుతున్నా..పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. నియోజకవర్గ సమీక్షలో స్థానిక కార్యకర్తలు కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. చంద్రబాబు నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ సమీక్షా సమావేశం జరిగింది. వల్లభనేని వంశీ రాజీనామా చేసినా కూడా ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వంశీ పార్టీని వీడినా తాము మాత్రం టీడీపీని వీడే ప్రసక్తేలేదంటున్నారు. అధినేత చంద్రబాబు మాటే తమకు శిరోధార్యమని చెబుతున్నారు. నాయకత్వ మార్పు చేయాల్సివస్తే దేవినేని అవినాష్కు గన్నవరం బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు.
పరోక్షంగా తేల్చేసిన కేశినేని నాని..
చంద్రబాబు ప్రతినిధులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వంశీతో మూడు గంటలపాటు చర్చించారు. పార్టీని వీడి వెళ్లవద్దని, అధినేత చంద్రబాబు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. అయినా వంశీ తన ఆలోచన మార్చుకున్నట్లుగా కనిపించలేదు. దీంతో..తాము వంశీకి చెప్పాల్సిందంతా చెప్పామన.., బంతి ఇప్పుడు వంశీ కోర్టులో ఉందంటూ నాని వ్యాఖ్యానించారు. కుటుంబంలో, వ్యాపారాల్లో ఉన్నట్లే రాజకీయాల్లోనూ సమస్యలుంటాయని, రాజకీయంగా రాటుదేలాలంటే కొన్ని ఒత్తిళ్లు భరించకతప్పదని కేశినేని నాని అన్నారు. వీరోచితంగా పోరాడి గెలిచిన వంశీ.. ఇప్పుడు వెన్ను చూపడం మంచిది కాదని హితవుపలికారు. పారిపోవడం మొదలు పెడితే జీవితాంతం పారిపోవాల్సి వస్తుందని చెప్పారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి కూడా వంశీ అంతే అవసరమని నాని తెలిపారు. వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉన్నారని, అంతిమంగా నిర్ణయం ప్రకటించాల్సింది ఆయనేనని కేశినేని స్పష్టం చేశారు.
అవినాశ్ ప్రత్యామ్నాయంగా..
వంశీ ఇక పార్టీ వీడినట్లే అనే విషయం టీడీపీలో కీలక నేతలకు స్పష్టత ఉన్నా..బయటకు మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. వంశీ వైసీపీలో చేరితే..అక్కడ టీడీపీ బాధ్యతలు దేవినేని అవినాశ్ కు ఇవ్వాలని డిమాండ్ తెర మీదకు వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అవినాశ్ గుడివాడ నుండి పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఇప్పటి నుండే గన్నవరం బాధ్యతలు అప్పగిస్తే అవినాశ్ కుటుంబానికి అక్కడ ఉన్న పరిచయాల ద్వారా ఎన్నికల నాటికి బలం పెంచుకుంటారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు గద్దే అనురాధ ను సైతం పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా వంశీ అధికారికంగా వైసీపీలో చేరిన తరువాత ఈ నియోజకవర్గ బాధ్యతల పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకనే అవకాశం ఉంది.