ఏపీపై కేసులు వెయ్యనున్న గ్లోబల్ కంపెనీలు ? జగన్ .. ఇదేంటి అని ప్రశ్నిస్తున్న బాబు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాజా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో పలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసిన అంశం గురించి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గ్లోబల్ కంపెనీలు కేసులను వేయనున్నాయని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. నేడు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ తాజా పరిస్థితిపై ఆవేదన చెందారు.
ఆదాయ పరంగా నిలదొక్కుకున్నా..: బాబు..జగన్ హయాంలో రాష్ట్ర రెవిన్యూ ఇలా: గతం కంటే 2.10 శాతం..!
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసిన ఏపీ సర్కార్ ... కేసులకు సిద్ధమైన కంపెనీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై గ్లోబల్ కంపెనీలు కేసులు వేయనున్నాయన్న వార్తలను చూసి ఆయన వీటిని చూస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత జూలైలో పలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టులను రద్దు చేస్తూ ఈ ప్రాజెక్టుల బిడ్డింగ్ లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం కారణాలుగా చూపింది.
గ్లోబెల్ కంపెనీల కేసుల వార్తలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్న బాబు
ఇక దీనిపై క్రిసిల్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, ఏపీలో భవిష్యత్ పెట్టుబడులకు విఘాతం కలిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, పలు కంపెనీలు సర్కారుపై కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. ఇక ఈ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు తనకు చాలా ఇబ్బంది కరంగా అనిపిస్తుందని, గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు తారసపడలేదు అని జగన్ కు తెలిపారు.
ఇక గ్లోబల్ కంపెనీల చర్యలు ఏపీకే కాదు దేశానికే ప్రమాదం అన్న చంద్రబాబు
ఇక ఆ వార్తకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేసి ఇదేంటి జగన్ అని ప్రశ్నించారు. విదేశీ కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల శాఖను బెదిరించడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా భారతదేశానికి అంతటికీ ప్రమాదమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఆయన ఇక తన ట్వీట్లో విదేశీ వ్యవహారాల శాఖామంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ను ట్యాగ్ చేసి మరీ పోస్ట్ చేశారు.
ఏపీలో పెట్టుబడుల విషయంలో జంకుతున్న విదేశీ సంస్థలు .. బాబు ట్వీట్
ఇక ఇప్పటికే పలు విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడుల ఆలోచన విరమించుకుని తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. సింగపూర్ కంపెనీలు...ఆంధ్రప్రదేశ్కు గుడ్ బై చెప్పేసి తెలంగాణ బాట పడుతున్నాయన్న అంశం నిన్న సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయిన నేపధ్యంలో కలిగింది . కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం మంత్రితో సమావేశమైన సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణ మద్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇక తాజాగా గ్లోబల్ కంపెనీలు లీగల్ చర్యలకు సిద్ధంగా ఉన్నాయన్న వార్తలు వస్తున్న క్రమంలో చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది.