జగన్కు గుదిబండలా మారిన విజయసాయిరెడ్డి, జీఎన్ రావు కమిటీపై సీపీఐ నారాయణ విసుర్లు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుదిబండలా మారారని విమర్శించారు. విజయసాయిరెడ్డి చేసే చర్యలు జగన్ను ఇబ్బందికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖలో భూ మాఫియా ఆగడాలపై వార్తలొస్తున్నా నేపథ్యంలో నారాయణ వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు.
భూ మాఫియా..
విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారబోతుందని భూ మాఫియాకు ముందే తెలుసని సీపీఐ నారాయణ గుర్తుచేశారు. అందుకోసమే భూములను భూ మాఫియా సేకరించిందని పేర్కొన్నారు. వైజాగ్ భూ మాఫియాలో వైసీపీ నేతలే గాక టీడీపీ నేతలు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని నియంత్రించాల్సింది పోయి, దగ్గరుండి ప్రోత్సహించేలా జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
కమిటీతో కాలక్షేపం..
రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీలతో జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం జగన్ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీలో విశాఖపట్టణం అయితే రాజధానిగా బాగుంటుందని స్పీకర్ చెబుతారు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను పరిశీలిస్తున్నామని పేర్కొంటారు.. తర్వాత కమిటీ నివేదిక వారు చెప్పినట్టే వస్తోందా అని ప్రశ్నించారు.
గుమాస్తా పని..
రాజధాని మార్పుకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టే జీఎన్ రావు కమిటీ పేర్కొన్నదని తెలిపారు. వాస్తవానికి జీఎన్ రావు కమిటీ అధ్యయనం చేయలేదని, గుమస్తా పని చేసిందిన విమర్శించారు. రాజధాని మార్పు ఎందుకు అని నారాయణ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్టని ప్రభుత్వం.. రాజధాని మార్పు గురించి కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు.
నేతల కుమారులు
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణం మారబోతుందన్న క్రమంలోనే రియల్ భూం వచ్చిందని కుండబద్దలు కొట్టారు సీపీఐ నారాయణ. భూ మాఫియకు జాతి, కులం, మతం ఉండవని, వారంతా ఒక్కటేనని చెప్పారు. టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు కుమారుడు కూడా భూకబ్జా దందాలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన విపక్ష టీడీపీకి చెందినవారు కదా అని ప్రశ్నించారు. భూ మాఫియా, కబ్జాకోరుల కులం ఒక్కటేనని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు కుమారులు కూడా భూ మాఫియాలో ఉన్నారని గుర్తుచేశారు. వైసీపీ నేత తిప్ప నాగిరెడ్డి కూడా భూ మాఫియా చేస్తున్నారని తెలిపారు.