ఆగని దాడులు.. విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం.. ఇప్పుడెవరిని సస్పెండ్ చేస్తారంటున్న స్థానికులు..
ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాముడి విగ్రహ ధ్వంసంతో విజయనగరం జిల్లాలోని రామతీర్థం రగులుతుండగానే...తాజాగా విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉన్న సీతాదేవి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడా... లేక విగ్రహం కిందపడి పగిలిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
గ్రిల్స్కు తాళం వేసి ఉండగానే విగ్రహ ధ్వంసం...
ఆలయానికి ఉన్న గ్రిల్స్కు తాళం వేసి ఉండగానే లోపల ఉన్న సీతాదేవీ విగ్రహం ధ్వంసమవడం గమనార్హం. ఈ ఉదయం విగ్రహ ధ్వంసాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న టీడీపీ,బీజేపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు.
ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన పోలీసులు... గాలికి విగ్రహం కిందపడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేయడంతో టీడీపీ,బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం సరికాదన్నారు.
ఇప్పుడెవరిని సస్పెండ్ చేస్తారు : స్థానికులు
సీతమ్మ విగ్రహ ధ్వంసంపై స్థానికుడు ఒకరు మాట్లాడుతూ... హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో హిందువులకు నిద్ర కరువైందన్నారు. శనివారం(జనవరి 2) రాత్రి జరిగిన ఈ ఘటనకు ఎవరిని సస్పెండ్ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెహ్రూ బస్టాండ్ డిపో మేనేజర్ను సస్పెండ్ చేస్తారా లేక పోలీస్ కమిషనర్ను సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. ఇన్ని దాడులు జరుగుతున్నా దేవాదాయ శాఖకు ఏమీ పట్టట్లేదని మండిపడ్డారు. దేవాదాయ శాఖ ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటే హిందువులుగా తామే తమ దేవతామూర్తులకు రక్షణ కల్పిస్తామన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
ఆలయ పూజారి ఈ ఘటనపై మాట్లాడుతూ... సాధారణంగా ప్రతీరోజూ ఉదయం 7.30గంటలకు తాను ఆలయానికి వచ్చి దీపారాధన చేసి వెళ్తానని చెప్పారు. ఈ ఘటన ఎలా జరిగిందో తనకేమీ తెలియదన్నారు. ఉదయాన్నే స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే అక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం హిందూ సంఘాలు,టీడీపీ,బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలతో అక్కడ ఆందోళన చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని వెంటనే గుర్తించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.