సినీ ఫక్కీలో బంగారం దుకాణంలో చోరీ.. వెనుకరంధ్రం చేసి అరకిలో బంగారం , 15 కిలోల వెండి చోరీ
విజయవాడలోని ఓ బంగారు దుకాణంలో సినీఫక్కీలో చోరీ చేశారు. జ్యూవెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన దొంగలు వెనుకవైపున రంధ్రం పెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సాయికిరణ్ జ్యూయలరీ దుకాణానికి వెనుక వైపు నిర్మిస్తున్న ఇంటి వైపు నుంచి వెనుక గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డారు. శనివారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య పక్కా ప్రణాళికతో ముగ్గురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇక ఈ చోరీ ఎలా చేశారంటే మొదట జ్యూవెలరీ షాప్ వెనక వైపు ఉన్న గోడకు రంధ్రం చేసి ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశిం చారు. సీసీ కెమెరాల్లో ముఖం కనిపించకుండా మాస్క్ లు ధరించారు. మరో వ్యక్తి బయట ఉండి గ్లౌజులు, ఇతర పరికరాలు వారికి అందించినట్టు సీసీ కెమెరాల్లో నమోదైంది. సీసీ కెమెరాను తమ వెంట తీసుకొచ్చిన ఆయుధంతో పగుల గొట్టాడు.
దుకాణం వెనక ఇంటి నిర్మాణం చేస్తున్న వ్యక్తి గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి యజమానికి చేరవేశాడు. దీంతో యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 500 గ్రాముల బంగారం ఆభరణాలు, 15 కేజీల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు, క్లూస్ టీమ్స్ను రంగంలోకి దింపాయి. చోరీకి పాల్పడిన దొంగల కోసం అన్వేషణ ప్రారంభించాయి.