పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలకు జగన్ పిలుపు..! ప్రభుత్వ సహకారం ఉంటుందన్న ఏపి సీఎం..!!
విజయవాడ/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు అనువైన వాతవరణం ఉందని, ప్రభుత్వం తరుపున అన్ని విధాల సహకారం ఉంటుందని పారిశ్రామిక వేత్తలకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.
జగన్ ఎందుకు వదులుతారు : పోర్టు ఒప్పందం రద్దు వెనుక అసలు కారణం: కేసీఆర్ తో సైతం ..!!
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు లేకపోవడం ఏపీకి ఇబ్బందికరమే అయినప్పటికీ..ఇక్కడ తీర ప్రాంతం అతిపెద్ద వనరు అని పేర్కొన్నారు. మా బలహీనతలు మాకు, మీకు తెలుసు. సుదీర్ఘ తీరప్రాంతం, మంచి వనరులు మా సొంతం. మాది సుస్థిర ప్రభుత్వం.. కేంద్రం సహకారం కూడా ఉంది. ఇటీవల చట్టసభల్లోనూ చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలన్నీ చెబుతున్నా అని సీఎం జగన్ అన్నారు.
ఇక విదేశీ పాదరిశ్రామిక వేత్తలు స్థాపించబోయే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం కావాల్సిన అర్హతలు తెలుసుకొని స్థానిక ఇంజినీరింగ్ కళాశాలల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని సీఎం పేర్కొన్నారు. ఏపీలో 4 ఓడరేవులు, 6ఎయిర్పోర్టులు ఉన్నాయని.. మరో నాలుగు పోర్ట్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇక ఆక్వా ఉత్పత్తుల్లోనూ ఏపీ ముందుందని..
అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం చేస్తున్నామని జగన్ తెలిపారు. పరిశ్రమలు, జలవనరుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరులో మెట్రో రైలు రావాలని.. ఎలక్ట్రిక్ బస్సులు, ఫుడ్ ప్రాసెసింగ్లో పెట్టుబడులు కావాలని జగన్ పెట్టుబడిదారులను కోరారు.
కాగా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 'డిప్లొమాటిక్ అవుట్ రీచ్' పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఈ సదస్సు జరగడం సంతోషంగా ఉందని.. దీని నిర్వహణకు సహకరించిన కేంద్రానికి జగన్ ధన్యవాదాలు తెలిపారు.