ముఖ్యమంత్రి కోసం గవర్నర్: నరసింహన్ ఆకస్మిక పర్యటన వెనుక: జగన్తో భేటీ..అదే కారణమా..
గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా ఏపీ పర్యటనకు వచ్చారు. కేవలం ముఖ్యమంత్రితో సమావేశానికే పరిమితం అయ్యారు. దాదాపు గంట పాటు సీఎం జగన్తో బేటీ అయ్యారు. ముందరోజు మాత్రమే సమాచారం ఇచ్చి గవర్నర్ ఇంత సడన్గా ఏపీకి రావటం వెను కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. సాధారణంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారిక కార్యక్రమాలు లేదా దైవ దర్శనం కోసం గవర్నర్ ఏపీకి వస్తూ ఉంటారు. కానీ, ఈ సారి కేవలం ముఖ్యమంత్రి తో భేటీ అయ్యారు. ఆ వెంటనే తిరుగు పయణమయ్యారు. సీఎం కాకుండా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో మాత్రమే గవర్నర్ భేటీ జరిగింది. ఇంతకీ ఏం జరిగింది.
విజయవాడకు గవర్నర్ నరసింహన్..
ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో పాటుగా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ముందుగానే నిర్ణయించిన దాని ప్రకారం ఆయన నేరుగా గేట్ వే హోటల్కు వెళ్లారు. ఆయన ఏపీ పర్యటన కేవలం ఒక్క రోజు ముందు మాత్రమే ఖరారైంది. ఆయన ఉన్న హోటల్ వద్దకు ముఖ్యమంత్రి జగన్ వచ్చారు. ఆయనతో పాటుగా మంత్రులెవరూ రాలేదు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం సీఎంతో పాటుగా వచ్చారు. గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రి జగన్ మధ్య దాదాపు గంట సేపు ఏకాంత చర్చలు సాగాయి. అప్పటి వరకు సుబ్బారెడ్డి మరో గదిలో వేచి ఉన్నారు. ఎప్పుడు ఏపీకి వచ్చినా..అధికారిక కార్యక్రమాలు..లేదా దైవ దర్శనాల కోసమే వచ్చే గవర్నర్ ఈ సారి మాత్రమే ఒక్కరే వచ్చారు. ఈ భేటీ తరువాత ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది.
జగన్తో ఏం చర్చించారు..ఏంటీ ప్రాధాన్యత..
గవర్నర్ నరసింహన్ కేవలం ముఖ్యమంత్రితో సమావేశం కోసమే ఏపీకి వచ్చారా అనే సందేహం కలుగుతోంది. విజయ వాడకు వచ్చిన గవర్నర్ అంత సడన్గా సీఎం జగన్ తో ఏం చర్చించారనే అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ నరసింహన్ ఈ వారంలో బదిలీ అవుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ వారంలోనే ఆయనకు ఉత్తర్వులు ఈ మేరకు అందనున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఆయన జగన్తో వ్యక్తిగత సమావేశం కోసమే ఇక్కడకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. గవర్నర్ సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు. ఆయన కేంద్రం నుండి ఏదైనా సందేశం జగన్ వద్దకు తీసుకొచ్చారని తెలుస్తోంది. కేంద్రం ఇప్పటికే ఏపీకి సహకారం అందిస్తు న్నదని..రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు తీవ్ర స్థాయిలో చేయనప్పటికీ..రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు సైతం ప్రారంభం కానుండటంతో కేంద్ర సాయం పైన చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..కేంద్ర సందేశం కీలకంగా మారే అవకాశం ఉంది.
ఇద్దరి మధ్య చర్చల్లో అదే కీలకమా..
ఇక, తరచూ గవర్నర్ను కలిసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా గవర్నర్ను కలవటం లేదు. వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అటు గవర్నర్..ఇటు కేసీఆర్ ఇద్దరికీ సన్నిహి తంగా ఉండే జగన్ తో ఆ అంశం మీదా చర్చ జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఇక, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిర్ణయాల పైన కేబినెట్ సబ్ కమిటీ ద్వారా విచారణ చేయిస్తున్నారు. దీని పైన నిర్దిష్టమైన లక్ష్యం సైతం నిర్ణయించుకున్నారు. దీంతో..ఈ విచారణల మీదనే గవర్నర్ నేరుగా సీఎంతో చర్చించటానికి విజయవాడకు వచ్చారనేది మరో వాదన. ఈ విచారణల మీద కేంద్రం గవర్నర్ ద్వారా ముఖ్యమంత్రి వద్దకు సందేశం పంపిందని ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా గవర్నర్ కేవలం ముఖ్యమంత్రిని కలిసేందుకు విజయవాడ రావటం అనేది సాధారణ విషయం కాదని..ఖచ్చితంగా వీరిద్దరి భేటీలో కీలక అంశాల పైనే చర్చ జరిగిందనేది సుస్పష్టం.