మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ద, ప్రజారోగ్యంపై లేదు, కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నా..: దేవినేని..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం జమ్మకాలపై ఉన్న శ్రద్ద.. కరోనా వైరస్ నిర్మూలనపై లేదన్నారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చింది విక్రయిస్తోంది వైసీపీ నేతలేనని ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో అక్రమ విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నాయని చెప్పారు.
Recommended Video
డేంజర్ బెల్స్..
5, 6 రోజుల్లో దేశంలో కరోనా వైరస్ ఢిల్లీని దాటుతోందని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కేంద్ర గణాంకాలు చెబుతోన్న సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు భోజనం లేని ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయని తెలిపారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, వెంటిలేటర్ల సంఖ్య చెప్పగలరా అని ప్రశ్నించారు.
ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ప్రభుత్వ దవాఖాన..
ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే, ప్రభుత్వ దవాఖానకు వెళ్లమంటారు. అక్కడికి వెళితే ఖాళీ లేదంటారని దేవినేని ఉమా మండిపడ్డారు. తెనాలిలో పారామెడికల్ సిబ్బంది మాస్కులు, కిట్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అంతేకాదు ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేయడం మంచి పద్దతి కాదన్నారు. దీనిపై సీఎం ఎందుకు స్పష్టత ఇవ్వరని ప్రశ్నించారు. సీఎం కంటే ప్రతిపక్ష నేత నయం అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.8 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారని ఉమా ప్రశ్నించారు.
మంత్రులకు పట్టదు..
మంత్రులకు ఇసుక, మద్యం, భూముల అమ్మకం తప్ప ఏమీ పట్టడం లేదని విమర్శించారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయటకు రారు అని మండిపడ్డారు. మృతదేహాలను బంధవులకు కూడా అప్పగించలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది అని దుయ్యబట్టారు. ఆగస్ట్ 15వ తేదీన విశాఖ వెళ్లడంపై జగన్కు ఉన్న శ్రద్ద.. ప్రజలపై లేదు అని మండిపడ్డారు.
కమీషన్ ఇవ్వకుండా..
రేషన్ డీలర్లకు కమీషన్ ఇవ్వకుండా వేధించడం సరికాదన్నారు. దీంతో 30 వేల కుటుంబాలను అభద్రతా భావంలోకి వెళ్లిపోయాయని దేవినేని అన్నారు. సచివాలయ వ్యవస్థతో రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని విమర్శించారు. దీంతో రైతులు వైసీపీ నేత, వాలంటీర్, ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన విత్తనం ప్యాకెట్ అందడం లేదన్నారు. ధాన్యం రైతులకు చెల్లించాల్సిన రూ. 246 కోట్లు ఎందుకు చెల్లించడం లేదన్నారు.