కృష్ణానదిపై మరో రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్ .. తొలిదశ పరిపాలన ఉత్తర్వులనిచ్చిన ఏపీ సర్కార్
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరందించాలని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి, తాజాగా కృష్ణా డెల్టాకు తాగునీరు అందించడానికి ప్రకాశం బ్యారేజి దిగువన మరో రెండు బ్యారేజీ ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ట్రాన్స్ జెండర్ లు , అనాధలకు బియ్యం కార్డులు
ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనా ఉత్తర్వులు
ప్రకాశం బ్యారేజి దిగువన రెండు బ్యారేజ్ లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రపురం మధ్య, ప్రకాశం బ్యారేజ్ కి పన్నెండు కిలోమీటర్ల దిగువున బ్యారేజీ నిర్మించనున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండి కొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్య ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన మరొక బ్యారేజ్ ని నిర్మించనున్నారు . ఈ రెండు బ్యారేజీ ల కోసం కోసం ఇన్వెస్టిగేషన్ పనులకు , సర్వే నిర్వహించడానికి, భూసేకరణ చేయడానికి 204. 37 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వరదనీరు సముద్రంలోకి వృధాగా పోకుండా నిర్ణయం
జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ తొలిదశ పరిపాలన ఉత్తర్వులను ఇచ్చారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటే జలాశయాల్లో నీటి సామర్ధ్యం తక్కువగా ఉండటంతో నీటిని వృధాగా సముద్రంలోకి వదులుతున్నారు . శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరడం, వరదల సమయంలో కృష్ణానదీ జలాలను వృధాగా సముద్రంలోకి వదిలివేయటం దృష్టిలో పెట్టుకొని కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంలో నీటిని అందించడమే లక్ష్యంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణానదిలోకి ఏపీ వంతుగా వచ్చే ప్రతి నీటి బొట్టు ఒడిసిపట్టే ప్రయత్నం
కృష్ణా నదిలోకి ఏపీ వంతుగా వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకే ఈ రెండు బ్యారేజ్ లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఈ ఏడాది కృష్ణా నదికి వరదలు పోటెత్తాయి. శ్రీశైలం జలాశయానికి అదనంగా 3,38,823 క్యూసెక్కుల నీరు చేరుతుంది. జూరాల, సుంకేసుల, హంద్రీలనుండి 2,28,991 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. శ్రీశైలంజలాశయం గరిష్ట నిల్వ దాటి కృష్ణా కృష్ణా నదిలోకి నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Recommended Video
కృష్ణా డెల్టా రైతాంగం కోసం ఏపీ ప్రభుత్వ నిర్ణయం .. ఉత్తర్వులతో తొలి అడుగు
నాగార్జున సాగర్ లో 589.7 అడుగుల్లో 311 .15 టీఎంసీల నీటిని స్థిరంగా నిల్వ చేస్తూ, 18 గేట్లు ఎత్తి మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుండి వదులుతున్న నీటిలో కొంత పులిచింతల ప్రాజెక్టు లకు చేరుతుండగా, మిగతా నీరు ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ లో సైతం నీటి నిల్వ సామర్థ్యం మించి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ లోని గేట్లను ఎత్తివేసి 3,79,389 క్యూసెక్కుల నీటిని వృధాగా సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీటిని కూడా వృధాగా పోనివ్వకుండా కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీటిని అందించాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యారేజిల నిర్మాణానికి సంబంధించి తొలి అడుగు పడింది.