అమరావతిలో భూముల కొనుగోలుపై వివరణ ఇచ్చిన హెరిటేజ్...
రాజధానిలో భూముల కొనుగోలుపై ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే...ముఖ్యంగా టీడీపీ నేతలతో పాటు హెరిటేజ్ గ్రూపు రాజధానిలో భూములు కొనుగోలు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు సార్లు ప్రకటించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడ హెరిటేజ్ 14 ఎకరాల భూమిని రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో కొనుగోలు చేసిందని ఆయన ప్రకటించారు. మొత్తం 4 వేల ఎకరాల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు.
దీంతో హెరిటేజ్ సంస్థల మంత్రి బుగ్గన చేసిన ఆరోపణలపై స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. వ్యాపార విస్తరణలో భాగంగానే భూములు కొనుగోలు చేశామని చెప్పారు. ఇందుకోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఈ నేపథ్యంలోనే 2014 మార్చిలోనే సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అనంతరం మూడు నెలలకు అనగా 2014 జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని చెప్పారు. ఇక మొత్తం మూడు దశల్లో మొత్తం 9.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. కాగా రాజధాని నిర్మాణ ప్రాంతం అమరావతికి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన స్థలం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వైసీప చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తమ ప్రకటనలో తెలిపారు.