కొడాలి నానికి హైకోర్టులో స్వల్ప ఊరట- మీడియాతో ఓకే- నిమ్మగడ్డపై మాత్రం నో
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి కొడాలి నాని చేసిన విమర్శల వ్యవహారంలో హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికలు ముగిసేవరకూ మీడియాతో మాట్లాడకుండా కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ విధించిన ఆంక్షలపై విచారణ జరిపిన హైకోర్టు.. మీడియాతో మాట్లాడేందుకు ఆయన్ను అనుమతించింది.
Recommended Video
ఎస్ఈసీ నిమ్మగడ్డ తనను మీడియాతో మాట్లాడకుండా విధించిన ఆంక్షలపై మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఓ దశలో మంత్రి కొడాలి వ్యాఖ్యల వీడియోను సైతం పరిశీలించిన హైకోర్టు ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో కోర్టు సహాయకుడిని సైతం నియమించింది. చివరికి నిమ్మగడ్డతో పాటు కొడాలి తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇందులో మంత్రి కొడాలి నానికి మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇస్తూనే నిమ్మగడ్డపై మాత్రం వ్యాఖ్యలు చేయకుండా ఆంక్షలు విధించింది.
ఇప్పటికే మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనూ హైకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. ఆయన కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆయనకు కూడా హైకోర్టు మీడియాతో మాట్లాడుకోవచ్చు కానీ నిమ్మగడ్డపై వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మంత్రి కొడాలి నాని కేసులోనూ హైకోర్టు ఇలాంటి ఆదేశాలే ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిమ్మగడ్డపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి కొడాలి నాని చేసిన వాదనను హైకోర్టు పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని దీన్ని బట్టి అర్ధమవుతోంది