ఏపీలో ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు విచారణ- సర్వీసు ప్రొవైడర్లు, కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు..
ఏపీలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఆధారాలుంటే వాటిని జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను హైకోర్టు సూచించింది. ఈ కేసులో దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
నాడు కేసీఆర్- ఇప్పుడు జగన్ - సీఎంలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు డేంజర్ గేమ్..
ఏపీలో విపక్షాలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే వాటిపై వివరాలు సమర్పించాలంటూ సర్వీసు ప్రొవైడర్లకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సర్వీసు ప్రొవైడర్ల నుంచి వివరాలు అందాకే దీనిపై స్పందిస్తామంటూ హైకోర్టు విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనికి స్పందనగా అలాంటిదేమీ లేదంటూ డీజీపీ గౌతం సవాంగ్ చంద్రబాబు లేఖకు జవాబిచ్చారు. చంద్రబాబు ఆరోపణలను అధికార వైసీపీ నేతలు కూడా తోసిపుచ్చారు. దీంతో ఇప్పుడు నిజానిజాలు వెల్లడికావాలంటే కీలకమైన హైకోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.