టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు .. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు అధికార వైసీపీ తీరుతో ఇబ్బంది పడుతున్నామని లబోదిబో అంటున్నతరుణంలో ఊహించని విధంగా హైకోర్టు ఇచ్చిన నోటీసులు టీడీపీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక్క గల్లా జయదేవ్ కు మాత్రమే కాదు జయదేవ్తో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్ రావులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో భాగంగా న్యాయస్థానం అతనికి నోటీజులు జారీ చేసింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి హైకోర్టు నోటీసులు
హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు నోటీసులు జారీ చేసింది. గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ గతంలోనే వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టులో మాడుగుల పిటీషన్
హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా జయదేవ్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని వైసిపి వర్గాలు అప్పట్లోనే ఆరోపణలు గుప్పించాయి. అక్కడ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు. ఆ 9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవని రిటర్నింగ్ అధికారి రిజక్ట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్లు పరిగణనలోకి తీసుకుంటే మోదుగుల వేణుగోపాలరెడ్డి గెలిచే అవకాశం ఉండేది.
ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్లు పరిగణనలోకి తీసుకోలేదని వ్యాజ్యం
అయితే ఈవిషంయలో కౌంటింగ్ రోజే... మోదుగుల, మంగళగిరి అభ్యర్థి ఆళ్ల... రిటర్నింగ్ అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా తన వాదనలు వినిపించారు. కవర్లపై సీరియల్ నెంబర్లు లేనంత మాత్రాన రిజక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నది మోదుగుల వాదన. అయితే గల్లా మాత్రం వాటిని నిరాకరించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ 9 వేలను పోస్టల్ బ్యాలెట్లను నిరాకరించారు.దీంతో ఈ వివాదంపై కోర్టుకెక్కారు మోదుగుల. ఓట్లను సక్రమంగా లెక్కించకపోవడంతో తాను ఓటమి పాలయ్యానని ఆయన దాఖలు చేసిన పిటీషన్ విషయంలో గల్లా జయదేవ్ కు నోటీసులు పంపించింది కోర్టు.
ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మెహన్ రావులకు కోర్టు నోటీసులు
ఇక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తి తరుపున వాసుదేవ రావు పిటీషన్ వేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాస రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు వారిని విచారణకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీ లకు టెన్షన్ పట్టుకుంది.