సీఎం జగన్తో రేపే హైపవర్ కమిటీ తుది సమావేశం.. రాజధానిపై తేల్చే ఛాన్స్..?
ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మూడోసారి సమావేశం కానుంది. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాజధానితో పాటు,అమరావతి రైతుల సమస్యలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. పాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఇప్పటికే రెండుసార్లు సీఎంతో సమావేశమైన కమిటీ.. రేపు జరగబోయే తుది సమావేశంలో రాజధాని అంశాన్ని తేల్చే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని హైపవర్ కమిటీ సూచించే పక్షంలో.. ఉద్యోగుల తరలింపు ప్రక్రియపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తక్షణం ఉద్యోగులను విశాఖకు తరలిస్తే.. అక్కడ ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల గురించి సమావేశంలో చర్చించవచ్చు. కమిటీ తుది నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
కాగా,ఇప్పటివరకు రెండుసార్లు సీఎంతో సమావేశమైన హైపవర్ కమిటీ పాలన వికేంద్రీకరణకే సూచనలు చేసిన సంగతి తెలిసిందే. తాజా భేటీతో విశాఖలోనే పరిపాలన రాజధాని ఏర్పాటును ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వం చెబుతున్నట్టు అమరావతిలో అసెంబ్లీ,విశాఖలో సచివాలయం,కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావచ్చు. మరోవైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ తుది సమావేశం నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.ఇక మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఇప్పటికే దీనిపై పోరాడుతుండగా.. బీజేపీ,జనసేనలు కలిసి రాజధాని కోసం పోరాడనున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా.. ఎన్ని ఆందోళనలు చేసినా.. సమగ్రాభివృద్దే తమ లక్ష్యమని మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు వైసీపీ నేతలు.