పబ్లిగ్గా గంజాయి అక్రమ రవాణా: విజయవాడ పీఎన్ బస్స్టేషన్లో పట్టివేత
విజయవాడ: రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి అక్రమంగా రవాణా అవుతోంది. కొద్దిరోజుల కిందట విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ గ్రామాల గుండా పొరుగు రాష్ట్రానికి తరలుతున్న టన్నుల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సారి ఏకంగా రాష్ట్ర పరిపాలనకు కేంద్రబిందువైన విజయవాడలోనే పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా చోటు చేసుకుంది.
విజయవాడలో 24 గంటలూ ప్రయాణికుల రద్దీతో నిండి ఉండే పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. దీని విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో వారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మఫ్టీలో మాటు వేశారు. అనుమానితుల కదలికలపై నిఘా వేశారు. ఈ సందర్భంగా హరికుమార్, కురుత్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా తచ్చాడుతుండటాన్ని గమనించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న లగేజీని తనిఖీ చేయగా.. పెద్ద మొత్తంలో గంజాయి పాకెట్లు కనిపించాయి.
వారిద్దరూ మలయాళీలుగా తేలింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన ఇద్దరూ స్వరాష్ట్రంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నట్లుగా నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సమాచారాన్ని తిరువనంతపురం పోలీసులకు తెలియజేశారు. ఛత్తీస్గఢ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, కేరళకు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. చెన్నై మీదుగా కేరళకు వెళ్లడానికి వారు విజయవాడలో బస్సు కోసం వేచి చూస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు.
మన రాష్ట్రానికి ఆనుకునే ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా అడవుల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు అవుతోందనే విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల నుంచి తమిళనాడు లేదా కేరళ వంటి రాష్ట్రాలకు తరలించాలంటే మన రాష్ట్రం గుండా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో- గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో- ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులను బలోపేతం చేశారు.
ఇదివరకు విశాఖపట్నం, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో రెండు టన్నుల మేర గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు టన్నుల గంజాయిని లారీలో నింపి ఒడిశాకు తీసుకెళ్తుండగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా వేశారు. ఇన్ ఫార్మర్లను యాక్టివేట్ చేశారు. కేరళకు గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారం కూడా ఇన్ ఫార్మర్ల నుంచే అందినట్లు పోలీసులు తెలిపారు.