స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: పెద్ద కుట్ర: జగన్ ఇమేజ్కు డ్యామేజ్: మా నమ్మానికీ: హీరో రామ్
విజయవాడ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ నటుడు రామ్ పోతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఈజ్ వాచింగ్ పేరుతో హ్యాష్ట్యాగ్ను జత చేసిన ఆయన అగ్నిప్రమాదంపై పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని రామ్ అన్నారు. వైఎస్ జగన్ రెప్యుటేషన్కు, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికీ డ్యామేజ్ కలుగుతోందని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లను సంధించారు.
స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంలో
విజయవాడ గవర్నరుపేటలో గల హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఈ నెల 9వ తేదీ తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఈ కోవిడ్ కేర్ సెంటర్ను నిర్వహిస్తోంది. దీనికోసం హోటల్ స్వర్ణ ప్యాలెస్ను లీజుకు తీసుకుంది. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కోవిడ్ కేర్ సెంటర్లోో 30 మంది పేషెంట్లు, 10 మంది వరకు వైద్య సిబ్బంది ఉన్నారు.
మొదట ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్గా..
రమేష్ ఆసుపత్రుల యాజమాని డాక్టర్ రమేష్.. నటుడు రామ్ పోతినేనికి దగ్గరి బంధువు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్నిప్రమాదం సంభవించిన హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అంతకుముందు ప్రభుత్వమే కోవిడ్ కేర్ సెంటర్ను నడిపించిందని రామ్ పోతినేని అన్నారు. ఆ తరువాతే రమేష్ ఆసుపత్రి యాజమాన్యం దాన్ని లీజుకు తీసుకుందని వివరించారు. ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్ను నిర్వహించే సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?, బాధ్యులుగా ఎవరిని గుర్తించే వాళ్లు? అని రామ్ ప్రశ్నించారు.
అగ్నిప్రమాదం నుంచి దృష్టి మరల్చడానికి
హోటల్ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం నుంచి దృష్టిని మరల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని రామ్ ఆరోపించారు. దీనికి బదులుగా ఫీజుల అంశాన్ని ప్రస్తావిస్తున్నారని అన్నారు. అత్యధికంగా ఫీజులను వసూలు చేస్తున్నట్లు రమేష్ ఆసుపత్రుల యాజమాన్యంపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందిన కరోనా పేషెంట్లకు ఇచ్చిన బిల్లింగులకు, రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. హోటల్ స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యమే నేరుగా బిల్లింగ్ చేసేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బిల్లులను ఆయన తన ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ ఎద్దేవా చేశారు.
Recommended Video
జగన్కు తెలియకుండా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్, రెప్యుటేషన్ను దెబ్బ తీయడానికి ఆయన కింద పనిచేస్తోన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని రామ్ పోతినేని చెప్పారు. జగన్ కింద పని చేసే కొంతమంది వ్యక్తులు ఆయనకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. జగన్ రెప్యుటేషన్కు, ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజీ కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచాలని రామ్ సూచించారు. దీనిపై ఆయన వరుసగా ట్వీట్లను పోస్ట్ చేశారు.