అమరావతిలో అవినీతి జరిగితే నిరూపించండి, వైసీపీ నేతలది పూటకో మాట, కంపెనీలు వెనక్కి: చంద్రబాబు
ఏపీలో రాజధాని మార్పు అంశం సెగలు రేపుతోంది. రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పరిణామాలు చకాచకా మారిపోతున్నాయి. ఈ నెల 27వ తేదీన క్యాబినెట్ ఉంటుందని.. జనవరి మొదటివారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామనే సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజధాని మార్పుపై సరికాదని ప్రభుత్వంపై మండిపడ్డారు.
అవినీతి నిరూపించాలని సవాల్..
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో అవినీతి జరగలేదని చంద్రబాబు స్పష్టంచేశారు. అవినీతి జరిగిందంటే నిరూపించాలని జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. నవ్యాంధ్ర రాజధాని కోసం రైతులు 32 వేల ఎకరాల భూములను ఇచ్చారని గుర్తుచేశారు. ఆ భూములు జరీబు భూములని.. మూడు పంటలు పండేవని చెప్పారు.
బతుకులు బాగుపడతాయనుకుంటే..
రైతులకు పంట వేయడమే పని. తమ భూమిలో సాగుచేసుకొని జీవించేవారు. రాజధాని రావడంతో తమ బతుకులు బాగుపడతాయనుకొని భూములు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. కానీ జగన్ ప్రభుత్వం రాజధాని మార్పుతో రైతుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. రాజధాని కోసం భూములిస్తే.. జగన్ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
పూటకో మాట..
రాజధానిలో వైసీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. దీంతో ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. రాజధాని ఉంటుందా ? ఉండదా అనే బెంగ వారికి పట్టుకొందని తెలిపారు. అందుకోసమే రైతుల స్వయంగా రోడ్లమీదికొచ్చి ఆందోళన చేస్తున్నారని వెల్లడించారు. రైతుల జీవితాలతో ఆడుకోవడం సరికాదని చంద్రబాబు సూచించారు.
ముందుకురానీ కంపెనీలు
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవ్యాంధ్ర అభివృద్ది వెనక్కి వెళ్లిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకురావడం లేదన్నారు. కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని చెప్పారు. కానీ సీఎం జగన్కు ఇవేమీ పట్టవని దుమ్మెత్తిపోశారు. ప్రజావేదిక కూల్చి, పోలవరం రివర్స్ టెండరింగ్ రద్దు చేసి జగన్ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు.