టీడీపీ అజెండాను బీజేపీ మోస్తోంది..నిర్వీర్యం కావడం తథ్యం?: ఐవైఆర్
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోలోమంటూ వలస వస్తోన్న నాయకుల చేరికలపై భారతీయ జనతాపార్టీలో తొలిసారి అసమ్మతి గళం వినిపించింది. ఆ గళాన్ని వినిపించింది ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో పెద్దగా క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ.. కొన్ని వేదికలపై పార్టీ గళాన్ని వినిపించారు. పార్టీ ప్రతినిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన అతి కొద్దిరోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు బీజేపీలో తీర్థాన్ని పుచ్చుకోవడంపై తొలిసారిగా ఆయన స్పందించారు. బీజేపీ కాస్త టీడీపీ జెండా, అజెండాను మోస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కొన్ని ట్వీట్లను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి టిడిపి అజెండాను తన అజెండాగా మోస్తూ ముందుకు పోతే 2019 ఎన్నికల్లో ఇచ్చిన ఒక సదావకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాజకీయంగా నిర్వీర్యం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 12, 2019
కాశ్మీర్ ఎప్పటికీ మాదే: మా నుంచి ఎవరూ విడదీయలేరు: జమాత్ ఉలేమా హింద్ చీఫ్
తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున పలువురు నాయకులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీకి అన్ని రకాలుగా అండదండలు అందించిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు వంటి నాయకులు బీజేపీలో చేరారు. ఆర్థిక నేరస్తులందరూ బీజేపీలో చేరి, పునీతులవుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలుమార్లు విమర్శించినప్పటికీ కమలనాథులు ఎవ్వరూ వాటిని తీవ్రంగా పరిగణించిన సందర్భాలు లేవు. బీజేపీలో దశాబ్దాల కాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న కొందరు సీనియర్లు సైతం టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి మాజీ టీడీపీ నేతలు తమ సొంత వైఖరిని బీజేపీ అభిప్రాయంగా వెల్లడించడాన్ని వారు తప్పు పట్టారు. పార్టీ సిద్ధాంతాన్ని హైజాక్ చేస్తున్నారనే విమర్శలు అంతర్గత సమావేశాల్లో వినిపిస్తూ వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీలో టీడీపీ నేతల చేరికపై తొలిసారిగా ఓ నిరసన గళం ఐవైఆర్ కృష్ణారావు రూపంలో వ్యక్తమైంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అజెండాను బీజేపీ తన అజెండాగా మోస్తోందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్ల పాటు కొనసాగితే.. ఎన్నికల్లో గెలవడం కష్టమని చెప్పారు. రాజకీయంగా నిర్వీర్యం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు కొన్ని ట్వీట్లను ఆయన సంధించారు. ఐవైఆర్ కృష్ణారావుకు బీజేపీలో మేథావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు ఉంది. పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల పట్ల పెద్దగా అంటీ ముట్టనట్టు కనిపించే ఐవైఆర్ కే టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన నాయకుల మాట తీరు, ప్రవర్తన నచ్చకపోతే.. ఇక పార్టీలో క్రియాశీలకంగా ఉంటోన్న సీనియర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
If in #andhrapradesh #tdp agenda becomes #bjp agenda it would end up as political hirakiri for the party. @BJP4India @BJP4Andhra
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 12, 2019
ఇక సీనియర్లు కూడా గళమెత్తుతారా?
సీఎం రమేష్, సుజన చౌదరి, టీజీ వెంకటేష్ వైఖరిపై బీజేపీ రాష్ట్రశాఖకు చెందిన కొందరు సీనియర్ నాయకుల్లో తీవ్ర అసహనం ఇదివరకే వ్యక్తమైంది. పార్టీ పదాధికారుల సమావేశంలో కొందరు దీనిపై బాహటంగానే విమర్శించినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోస్తా జిల్లాలకు చెందిన ఓ సామాజిక వర్గ సీనియర్ నేతలు బీజేపీ పదాధికారుల సమావేశంలో వారిద్దరి వైఖరిని ప్రస్తావనకు తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయించిన తరువాత కూడా సీఎం రమేష్, సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధులుగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మద్దతుగా వారు మాట్లాడుతున్నారని, ఇలాగైతే పార్టీలో కొనసాగడం కష్టమనే అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయా అంశాలేవీ బయటికి రాలేదు. తాజాగా ఐవైఆర్ పార్టీ వైఖరిపై తొలిసారిగా స్పందించారు. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.